Bail For Renuka: టిఎస్పిఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలికి బెయిల్….
Bail For Renuka: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టైన రాథోడ్ రేణుకకు బెయిల్ మంజూరైంది. టిఎస్పిఎస్సీ నిర్వహించిన అసిస్టింట్ ఇంజనీర్, ఏఈఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో రేణుక కీలక పాత్ర పోషించింది.
Bail For Renuka:టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలగా ఉన్న రాథోడ్ రేణుకకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు రేణుకకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తు, పాస్ పోర్టు సమర్పించాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు రేణుకకు ఆదేశించింది.
గతంలో కూడా రేణుక బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని తిరస్కరించింది. రేణుక అనారోగ్య సమస్యలు ఉండటం, పిల్లల సంరక్షణ చూడాల్సి ఉండటం, కేసు దర్యాప్తు కూడా చివరి దశలో ఉండటంతో రేణుకకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు లాయర్ కోర్డును కోరారు. దీంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు రాజేందర్, రమేష్ కుమార్లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకే కేసులో ఓవైపు ఈడీ, మరోవైపు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసిన ఈడీ నిందితులను విచారిస్తోంది.
TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే పోలీసులు రేణుకను అరెస్ట్ చేశారు. ప్రవీణ్తో ఉన్న సాన్నిహిత్యంతో పేపర్ కొనుగోలు చేసి దానిని ఇతరులకు విక్రయించినట్లు గుర్తించారు. తమ తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేణుక తమ్ముడికి ఏఈ పరీక్షకు హాజరయ్యే అర్హత లేకపోయినా అతని పేరుతో ప్రశ్నాపత్రాల కోసం ప్రయత్నించినట్లు గుర్తించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వద్ద సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ నుంచి ప్రశ్నాపత్రాలు సేకరించి వాటిని విక్రయించేందుకు అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన సోదరుడు రాజేశ్వర్ నాయక్కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్తో రేణుక బేరం కుదుర్చుకుంది.
టీటీసీ చదివిన రాజేశ్వర్ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు కావాల్సిన విద్యార్హత అతనికి లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్తో చెప్పింది. అదే సమయంలో ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కె.నీలేష్నాయక్, పి.గోపాల్ నాయక్లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బులు తీసుకుని ప్రవీణ్కు ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్ తన బ్యాంకు ఖాతాలో జమచేశాడు.
రాజమండ్రిలో ఉన్న తన బాబాయికి ప్రవీణ్ రూ.3.5 లక్షలు ఆన్లైన్లో పంపినట్టు పోలీసులు గుర్తించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగి రాజశేఖర్కు ప్రవీణ్ డబ్బు ఆశ చూపించి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో అతనికి కొంత ఇస్తానని చెప్పాడు. ఈలోపే పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో రాజశేఖర్కు సొమ్ము అందలేదని పోలీసులు గుర్తించారు.