Shreyas Iyer: మూడు నెలలు ఔట్.. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్కూ అయ్యర్ దూరం
Shreyas Iyer: మూడు నెలలు ఔట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు సర్జరీ చేయించుకోనున్నాడు.
Shreyas Iyer: టీమిండియాకు, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు పెద్ద షాకే తగిలింది. వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ మూడు నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. అతడు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించడంతో ఐపీఎల్ తోపాటు జూన్ లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా అందుబాటులో ఉండబోవడం లేదు.
ముఖ్యంగా కేకేఆర్ టీమ్ అతడు సీజన్ మధ్యలో అయినా తిరిగి వస్తాడని ఆశించింది. అప్పటి వరకూ కెప్టెన్సీని నితీష్ రాణాకు అప్పగించింది. కానీ అతడు సీజన్ మొత్తానికి రాడని తేలడంతో ఆ టీమ్ కు కోలుకోలేని దెబ్బ పడింది. ఈఎస్పీఎన్క్రికిన్ఫోలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. శ్రేయస్ తన వెన్ను గాయానికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో అతడు కనీసం మూడు నెలలైనా ఆటకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యర్ చాలా రోజులుగా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ టూర్ లో ఇదే గాయంతో అతడు వన్డే సిరీస్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టుతోపాటు వన్డే సిరీస్ ఆడలేకపోయాడు.
శ్రేయస్ వెన్ను కింది భాగంలో వాపు వచ్చింది. దీని కారణంగా విపరీతమైన నొప్పితో అతడు బాధపడుతున్నాడు. సర్జరీ అవసరం లేకుండా మందులతో తగ్గిపోతుందేమో అని అయ్యర్ కొన్నాళ్లు వేచి చూశాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో సర్జరీ కోసం అతడు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకుముందే పేస్ బౌలర్ బుమ్రా కూడా న్యూజిలాండ్ వెళ్లి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.
అయ్యర్ లేకుండా ఐపీఎల్ బరిలోకి దిగిన కేకేఆర్ తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆ టీమ్ 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
సంబంధిత కథనం