Sandeep Sharma on Dhoni: ధోనీ స్పీడుకు అలా బ్రేకులు వేశాను.. చివరి ఓవర్ ప్లాన్పై సందీప్ శర్మ
Sandeep Sharma on Dhoni: ధోనీ స్పీడుకు అలా బ్రేకులు వేశాను అంటూ చివరి ఓవర్ ప్లాన్ వివరించాడు సందీప్ శర్మ. అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధోనీ, జడేజాలాంటి వాళ్లు క్రీజులో ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది రాజస్థాన్ రాయల్స్.
Sandeep Sharma on Dhoni: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన విషయం తెలుసు కదా. క్రీజులో ధోనీ, జడేజాలాంటి వాళ్లు ఉండటంతో సీఎస్కే గెలుపు ఖాయమని చాలా మంది భావించారు. అందుకు తగినట్లే ధోనీ రెండు సిక్స్ లు కొట్టి ఆశలు రేపాడు. కానీ చివరి బంతికి కూడా అలాంటి షాట్ అవసరమైనా సందీప్ శర్మ యార్కర్ బాల్ ను ధోనీ ఆడలేకపోయాడు.
దీంతో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలిచింది. అయితే ఆ చివరి ఓవర్ ఎంతో ఒత్తిడిలోనూ అంత పర్ఫెక్ట్ గా ఎలా వేయగలిగాడో సందీప్ శర్మ వివరించాడు. ఆ ఓవర్ కోసం తాను ముందుగానే వేసుకున్న ప్లాన్ గురించి అతడు చెప్పాడు. నిజానికి ధోనీ రెండు సిక్స్ లు కొట్టిన తర్వాత అతడు తన ప్లాన్ మార్చి రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేశాడు. యార్కర్లతో ధోనీ, జడేజాలకు అడ్డుకట్ట వేశాడు.
"యార్కర్లు వేయగలిగే నా సామర్థ్యాన్ని నమ్ముకున్నాను. నెట్స్ లో యార్కర్లు బాగా వేస్తున్నాను. గ్రౌండ్ కు ఓవైపు బౌండరీ దూరంగా ఉంది. ధోనీ కాళ్ల దగ్గర యార్కర్ వేయాలనుకున్నా. కానీ ఆ రెండు బంతులు ఫుల్ టాస్ కావడంతో సిక్సర్లుగా మలిచాడు. ఆ సమయంలో అరౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. దీంతో నా యాంగిల్ మారింది. ఫలితం దక్కింది" అని సందీప్ శర్మ చెప్పాడు.
అతని ప్లాన్ నిజంగా వర్కౌటైంది. చివరి బంతికి అతడు కాస్త దూరంగా యార్కర్ లెంత్ బాల్ వేయడంతో ధోనీ దానిని భారీ షాట్ ఆడలేకపోయాడు. అటు జడేజా కూడా అంతకుముందు హోల్డర్ బౌలింగ్ లో రెండు సిక్స్ లు కొట్టడంతో అతనికి కూడా కాస్త దూరంగా బాల్ వేయాలని అనుకున్నానని, అలాగే వేయడంతో జడ్డూ దానిని షాట్ ఆడలేకపోయినట్లు సందీప్ తెలిపాడు.
మాంచి ఊపు మీదున్న ఈ ఇద్దరు బ్యాటర్లను చివరి మూడు బంతుల్లో సందీప్ నిలువరించగలిగాడు. ఆ మూడు బాల్స్ కూడా యార్కర్లే కావడం విశేషం. దీంతో మూడు పరుగులతో రాజస్థాన్ గెలిచింది. సీఎస్కే సొంతగడ్డపై ఆడుతున్నా, ధోనీకి కెప్టెన్ గా ఇది 200వ మ్యాచ్ అయినా కూడా ఆ టీమ్ గెలవలేకపోయింది.
సంబంధిత కథనం