No India without Virat Kohli: ఐసీసీపై భారత అభిమానుల ఆగ్రహం.. వీడియోలో విరాట్ లేకపోవడంతో విమర్శలు
No India without Virat Kohli: ఐసీసీ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలో విరాట్ కోహ్లీ లేకపోవడంతో భారత అభిమానులు సదరు క్రికెట్ అత్యున్నత సంస్థపై విమర్శలు సందిస్తున్నారు. ఈ వీడియోలో రోహిత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, చాహల్తో పాటు కోహ్లీ లేనందుకు మండిపడుతున్నారు.
No India without Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సీల్(ICC) టీ20 వరల్డ్ కప్ 2022 వినూత్నంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ టోర్నికి సంబంధించిన ప్రచారం కోసం సరికొత్త మార్గాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్, పోస్టులు పెడుతూ క్రికెట్ ప్రియులను ఆకర్షిస్తోంది. దీంతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్.. టీ20 వరల్డ్ కప్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐసీసీ భారత అభిమానులను కూడా దృష్టిలో ఉంచుకుని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో సరికొత్త రీల్తో దర్శనమిచ్చింది. అయితే అనూహ్యంగా భారత అభిమానుల ఆగ్రహానికి ఐసీసీ కారణమైంది.
ఇంతకీ ఏమైందంటే టీ20 వరల్డ్ కప్లో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ రీల్లో రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, యజువేంద్ర చాహల్తో కలిపి ఓ రీల్ను పోస్ట్ చేసింది. భారత్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ పొట్టి ప్రపంచకప్ గురించి ప్రచారాన్ని టీమిండియా క్రికెటర్లతో ప్రారంభించింది. ఈ రీల్ను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా భారత అభిమానులు మాత్రం ఐసీసీ ఇన్స్టా రీల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు కారణం.. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ లేకపోవడమే. రోహిత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, యజువేంద్ర చాహల్ మాత్రమే ఇందులో ఉండటం, కోహ్లీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఐసీసీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కామెంట్ల రూపంలో తమ స్పందనను తెలియజేస్తున్నారు.
రియల్ కింగ్ ఎక్కడా? అని ఓ యూజర్ స్పందించగా.. విరాట్ లేకుండా ఇండియానే లేదు అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. విరాట్ లేకుండా ఇది అసంపూర్తిగా ఉందని ఇంకో వ్యక్తి స్పందించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఐసీసీ వీడియోలో లేకపోవడం బాధాకరమని మరో వ్యక్తి పోస్ట్ పెట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో విజయం తర్వాత మరో వార్మప్ గేమ్కు టీమిండియా సిద్ధమవుతుంది. న్యూజిలాండ్తో బుధవారం నాడు ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్లో తన తొలి గేమ్కు టీమిండియా ఆడబోయే చివరి వార్మప్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. దీని తర్వాత అక్టోబరు 23న ఆరంభ మ్యాచ్ను పాకిస్థాన్తో ఆడనుంది భారత్.
సంబంధిత కథనం