Parliament monsoon session : మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. విపక్షాల నిరసనలు, ఆందోళనలతో నూతన పార్లమెంట్ భవనం దద్దరిల్లుతోంది. ఉభయ సభల్లో వాయిదాల పర్వం వార్తలకెక్కింది. ఓ పక్క నిరసనలు, వాయిదాలు కొనసాగుతుంటే.. మరో పక్క అనేక బిల్లులపై సైలెంట్గా ఆమోద ముద్రపడింది.
జులై 24-28 మధ్య లోక్సభలో ప్రభుత్వం 11 బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిల్లో ఐదింటికి ఆమోదం లభించింది. ఇక రాజ్యసభలో.. మూడు బిల్లులను గట్టెక్కించగలిగింది కేంద్రం. అయితే.. సరైన చర్చ జరగకుండా వీటికి ఆమోదం లభించడం గమనార్హం. ప్రధాన విపక్షాలేవీ చర్చలో పాల్గొనకపోతుండటం ఇందుకు కారణం.
Manipur violence Parliament : ఉదాహరణకు.. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ చట్ట సవరణ బిల్లు 2022కు 49 నిమిషాల్లోనే ఆమోదం లభించేసింది! రాష్ట్రాల్లోని కోఆపరేటివ్ సొసైటీల్లో కుటుంబసభ్యుల పాత్రను నియంత్రించే విధంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించేదే ఈ చట్టం. లోక్సభలో పెద్దగా చర్చ జరగకుండానే ఈ కీలక బిల్లు గట్టెక్కేసింది. అదే సమయంలో ఈ నెల 26న.. ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023ని లోక్సభ ఆమోదించింది. గతంలో దీనిని విపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలో కేవలం నలుగురు ఎంపీలే పాల్గొన్నారు.
బయోలాజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2021కు దిగువ సభలో కేవలం 34 నిమిషాల్లోనే ఆమోదం లభించింది. ఇదే సభలో.. కేవలం 9 నిమిషాలలోనే రిపీలింగ్ అండ్ అమెండ్మెండ్ బిల్లు గట్టెక్కేసింది. 42 చట్టాలను సవరించగలిగే జన్ విశ్వాస్ బిల్లుకు 42 నిమిషాల్లో ఓకే చెప్పేసేంది లోక్సభ.
No confidence motion news : ఇలా బిల్లులు పాసైపోతున్న విషయం విపక్షాలకు కూడా తెలుసు. ఇందులో పలు కీలక బిల్లులు ఉన్నట్టు నేతలు అంగీకరిస్తున్నారు. అయితే.. ఢిల్లీ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును మాత్రం గట్టెక్కనివ్వకుండా చూసుకుంటామని నేతలు చెబుతున్నారు.
"బిల్లులు పాస్ అవుతున్నాయని మాకు తెలుసు. కానీ మాకు చాలా ముఖ్య విషయాలు ఉన్నాయి. మా ఫోకస్ అంతా దిల్లీ ఆర్డినెన్స్పైనే," అని టీఎంపీ ఎంపీ డారెక్ ఓబ్రెన్ తెలిపారు.
దిల్లీలో దౌత్యాధికారుల బదిలీ, పోస్టింగ్కు సంబంధించిన అధికారాన్ని తమ వద్ద పెట్టుకునే విధంగా.. కేంద్రం తీసుకొచ్చిందే ఈ నేషనల్ క్యాపిల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ అమెండ్మెండ్ బిల్. ఇది వచ్చే వారం.. లోక్సభలోకి వచ్చే అవకాశం ఉంది.
మొత్తం మీద పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం చాలా వృథా అవుతోంది. ఇప్పటివరకు ఉభయసభలు కలిపి కేవలం 42 ప్రశ్నలకే సమాధానాలు లభించాయి. లోక్సభ 48 నిమిషాలు, రాజ్యసభ 90 నిమిషాలు మాత్రమే పనిచేశాయి!
మరోవైపు.. మణిపూర్ హింస నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇంత వరకు ఇది సభ ముందుకు రాలేదు. వచ్చే వారంలో దీనిని లోక్సభలో ప్రవేశపెడతారని తెలుస్తోంది.
సంబంధిత కథనం