Supreme Court: ‘ఈ సమయంలో స్టే ఇవ్వలేం’- ఈసీల నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు స్పందన-supreme court says it cant stay law on election commissioners appointment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: ‘ఈ సమయంలో స్టే ఇవ్వలేం’- ఈసీల నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు స్పందన

Supreme Court: ‘ఈ సమయంలో స్టే ఇవ్వలేం’- ఈసీల నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు స్పందన

HT Telugu Desk HT Telugu
Mar 21, 2024 01:17 PM IST

Supreme Court: ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సున్నితమైన అంశంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, ఆ చట్టం అమలుపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అలాంటి ఆదేశాలు సరికావని పేర్కొంది.

 సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

Supreme Court on ECs appointment: ఎన్నికలకు ముందు గందరగోళం సృష్టించే అవకాశం ఉన్నందున ఈ దశలో ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టంపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. 2023 లో కేంద్రం రూపొందించిన కొత్త చట్టంలో ఎన్నికల కమిషనర్ల నియమించే ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. దీనిపై ఒక స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కొత్త ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. పూర్తి వివరాలతో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ల ధర్మాసనం సూచించింది. 2023 చట్టం ప్రకారం చేసిన నియామకాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం, "సాధారణంగా, మేము మధ్యంతర ఉత్తర్వుల ద్వారా చట్టంపై స్టే ఇవ్వము" అని తెలిపింది. అనంతరం, ఆ పిటిషన్లపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

కోర్టులో వాదనలు

మార్చి 21న మళ్లీ ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీ కాలం) చట్టం 2023లో స్పష్టమైన ఉల్లంఘన జరిగిందని పిటిషనర్ జయ ఠాకూర్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నికల కమిషన్ "రాజకీయ" మరియు "కార్యనిర్వాహక జోక్యానికి" దూరంగా ఉండాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కమిషనర్ల సెలక్షన్ ప్యానెల్ నుండి సీజేఐని మినహాయించడాన్ని ఏడీఆర్ సవాలు చేసింది.

కొత్త కమిషనర్ల ఎంపిక తరువాత..

ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులను ఈసీలుగా నియమించిన నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్యానెల్ వీరిని ఎంపిక చేసింది. ఫిబ్రవరి 14న అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో ఈసీల్లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023లోని సెక్షన్ 7 ప్రకారం సీఈసీ, ఈసీలను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి సీజేఐని మినహాయించారు. ఈ సెక్షన్ అమలుపై స్టే విధించాలని ఏడీఆర్ కోరింది.

IPL_Entry_Point