Delhi crime news: తనతో పాటు ఉండే వ్యక్తి తనపై పదే పదే అత్యాచారానికి ప్రయత్నిస్తుండడంతో కోపంలో ఆ వ్యక్తిని ఒక 16 ఏళ్ల బాలుడు చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎర్ర కోటకు సమీపంలో జరిగింది.
నిందితుడైన 16 ఏళ్ల బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ లోని షేక్ పుర కు చెందిన ఒక 16 ఏళ్ల బాలుడు సినిమా రంగంలో పని చేయాలన్న ఆలోచనతో ఇంటి నుంచి వచ్చేశాడు. చివరకు ముంబైకి కాకుండా, ఢిల్లీకి చేరాడు. అక్కడ తనకు పరిచయమైన 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. వారు ఎర్ర కోట (red fort) కు సమీపంలోని కొత్వాలి ప్రాంతంలోని ఒక మురికివాడలో ఉంటున్నారు. ఆ 45 ఏళ్ల వ్యక్తి సమీపంలోని మార్కెట్లో కూలి పనులు చేస్తుంటాడు. గత కొంత కాలంగా ఆ వ్యక్తి ఈ బాలుడిపై లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ బాలుడు అందుకు నిరాకరిస్తూ, అడ్డుకుంటున్నాడు. చివరకు రెండు రోజుల క్రితం కూడా ఆ వ్యక్తి ఈ బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇక ఓపిక నశించిన ఆ బాలుడు, కోపంతో ఆ వ్యక్తిపై దగ్గర్లో ఉన్న సిమెంట్ దిమ్మెతో తలపై మోది, కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు.
రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం పడి ఉందన్న సమాచారం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన సిమెంట్ దిమ్మెను, కర్రను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా విచారించగా, ఆ మృతుడి వివరాలు, అతడితో పాటు ఉండే బాలుడి వివరాలు పోలీసులకు తెలిశాయి. దాంతో గాలింపు ప్రారంభించి, సమీపంలోని ఒక ప్రాంతంలో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ విడిచి వెళ్లడానికి ఆ బాలుడు ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆ బాలుడిని జువనైల్ జస్టిస్ బోర్డ్ కు అప్పగించారు.