Crime : కారు పార్కింగ్ కోసం గొడవ.. రాళ్లు- ఇటుకలతో కొట్టి చంపేశారు!
Delhi Crime news : కారులో అర్ధరాత్రి వేళ స్నేహితులతో బయటకు వెళ్లాడు ఆ వ్యక్తి. మెట్రో స్టేషన్ గేట్ వద్ద పార్కింగ్కు ప్రయత్నించాడు. కానీ ఓ ఆరుగురు అక్కడే నిలబడి ఉన్నారు. పక్కకు జరగాలని వారిని అడిగాడు. వారు వినలేదు. చివరికి గొడవ మొదలైంది. ఆ ఆరుగురు.. ఆ వ్యక్తిని రాళ్లు, ఇటుకలతో కొట్టి చంపేశారు. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన.
Delhi Crime news : ఢిల్లీలో కారు పార్కింగ్పై మొదలైన గొడవ.. ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆరుగురు కలిసి.. ఓ 32ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు!
పార్కింగ్పై గొడవ..
ఢిల్లీలోని సాకెత్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. మెట్రో స్టేషన్ దగ్గర ఓ వ్యక్తి.. రక్తపుమడుగులో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లేసరికి అక్కడ ఆ వ్యక్తి లేడు. అతడిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుసుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత.. ఆ వ్యక్తికి సంబంధించిన స్నేహితుడిని పోలీసులు కలిసి విచారించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.
రోహిత్ అనే వ్యక్తి.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం అర్ధరాత్రి సమయంలో కారులో బయటకు వెళ్లాడు. మెట్రో స్టేషన్ గేట్.2 వద్ద కారును పార్క్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ అప్పటికే అక్కడ ఆరుగురు నిలబడి ఉన్నారు. హారన్ కొట్టిన రోహిత్.. పక్కకు జరగాలని ఆ ఆరుగురికి చెప్పాడు. వారు కదలలేదు. దీంతో కారులో నుంచి కిందకి దిగి.. వారి వద్దకు వెళ్లాడు రోహిత్. చివరికి గొడవ ముదిరింది.
రోహిత్ను పట్టుకున్న ఆ ఆరుగురు.. పక్కనే ఉన్న రాళ్లు, ఇటుకలతో కొట్టారు. రోహిత్ తలకు బలమైన గాయమైంది. అతడి శరీరం నుంచి రక్తం బయటకు రావడం మొదలైంది. చివరికి రోహిత్ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.
ఈ ఘటన 1:30 గంటలకు జరగ్గా.. తెల్లవారముజామున 4:30 గంటల ప్రాంతాల్లో రోహిత్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చివరికి.. నిందితుల్లో ఒకడైన 22ఏళ్ల ప్రియాన్షూ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. అతను నేరాన్ని అంగీకరించాడు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనం
టాపిక్