West Bengal governor CV Ananda Bose: ఉప రాష్ట్రపతి గా పోటీ చేయడం కోసం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీశ్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఇప్పటివరకు మణిపుర్ గవర్నర్ గణేశన్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మాజీ సివిల్ సర్వెంట్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ ను కేంద్రం నియమించింది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఐఏఎస్ అధికారిగా పలు జిల్లాల్లో కలెక్టర్ గా, కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీ, ప్రిన్స్ పల్ సెక్రటరీ, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్, చీఫ్ సెక్రటరీ తదితర కీలక బాధ్యతలను డాక్టర్ సీవీ ఆనంద బోస్ నిర్వర్తించారు. విద్య, అటవీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖల్లో సేవలందించారు. ఐరాస ‘హ్యాబిటాట్ అలయన్స్’ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.
డాక్టర్ సీవీ ఆనంద బోస్ ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్ ను సాధించారు. అలాగే, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ , ముస్సోరిలో తొలి ఫెలోషిప్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ దే కావడం విశేషం. రచనా వ్యాసాంగం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. డాక్టర్ సీవీ ఆనంద బోస్ ఇంగ్లీష్ లో, హిందీలో, మలయాళంలో దాదాపు 40 పుస్తకాలు రాశారు. వాటిలో నవలలు, కథా సంకలనాలు, కవితలు, వ్యాసాలు ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ సెల్లర్స్ గా నిలిచాయి. ఆయన చాలా పత్రికలకు కాలమిస్ట్ గా ఉన్నారు.
కేరళలోని కొల్లాంలో 1952లో డాక్టర్ సీవీ ఆనంద బోస్ జన్మించారు. బిట్స్ పిలానీలో విద్యను అభ్యసించారు. హ్యాబిటాట్ అండ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ పై పీహెచ్ డీ సాధించారు. 1977లో ఐఏఎస్ అధికారిలో కేరళలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కొల్లాం కలెక్టర్ గా పర్యావరణ హిత గృహ నిర్మాణాల కోసం కృషి చేశారు.