BF.7 variant India : ఇండియాపై కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావం.. తక్కువే!
BF.7 variant India : ఇండియాపై కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిస్తున్నారు.
BF.7 variant India : చైనాలో పుట్టుకొచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా పొరుగు దేశమైన ఇండియాలో ప్రజలు భయపడిపోతున్నారు. చైనాలో వెలుగులోకి వస్తున్న కొవిడ్ కేసులను చూసి వణికిపోతున్నారు. జీవితం మళ్లీ కొవిడ్ సంక్షోభంలోకి వెళిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. భారతీయులకు ఊరటని కలిగించే వార్త ఒకటి బయటకొచ్చింది. చైనాతో పోల్చుకుంటే.. కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 ప్రభావం ఇండియాలో తక్కువగానే ఉంటుందని సీసీఎంబీ(సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలాజీ) డైరక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు. భారతీయుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే ఈ ఒమిక్రాన్ సబ్వేరియంట్ ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు.
బీఎఫ్.7 ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలి అని పిలుపునిచ్చారు వినయ్ కే నందికూరి. ఒమిక్రాన్ వేరియంట్లకు రోగనిరోధక శక్తిని బలహీనపరిచే శక్తి ఉంటుందని హెచ్చరించారు.
Omicron BF.7 variant : "డెల్టాతో పోల్చుకుంటే బీఎఫ్.7 వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ పొందడమే ఇందుకు కారణం. మనపై ఇతర వైరస్ల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టే మనకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల బీఎఫ్.7తో భయపడాల్సిన పని లేదు. డెల్టాతో భయపడ్డాము. ఆ తర్వాత టీకాలు వచ్చాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. దానిపై పోరాటంగా బూస్టర్ డోస్లు వచ్చాయి. చైనాతో పోల్చుకుంటే మనం చాలా డిఫరెంట్. చైనాలో ఇప్పుడు జరుగుతున్నది ఇండియాలో జరగకపోవచ్చు," అని సీసీఎంబీ డైరక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు.
"చైనాలో పాటించే జీరో కొవిడ్ నిబంధనే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారింది. అక్కడ టీకాలు తీసుకున్న వారి సంఖ్య కూడా తక్కువే. అందుకే తీవ్రత ఎక్కువగా ఉంది. ఇండియాలో కొవిడ్ రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్లు కూడా తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఇండియా సేఫ్ జోన్లో ఉందనే చెప్పాలి," అని వినయ్ స్పష్టం చేశారు.
నాలుగు కేసులు..!
India BF.7 variant news : మీడియా నివేదికల ప్రకారం.. బీఎఫ్.7 ఒమిక్రాన్ సబ్వేరియంట్కు సంబంధించి.. దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా ఆదివారం 227 కేసులు వెలుగులోకి వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,424కు చేరింది. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.46కోట్లు దాటింది. దేశంలో కొవిడ్ కారణంగా 5,30,693మంది ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో ఇద్దరు మరణించారు.
మరోవైపు ఈ ఏడాది చివరి మన్-కీ-బాత్లో భాగంగా ప్రజలు కొవిడ్పై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం