Kiara Advani: ఓటీటీలో కియారా అద్వాణీ డిమాండ్ మామూలుగా లేదుగా
భూల్ భులయ్యా,జగ్ జగ్ జియో సక్సెస్ ల తర్వాత కియారా అద్వాణీ (Kiara Advani) నటిస్తున్న బాలీవుడ్ సినిమా గోవింద్ నామ్ మేరా సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ఏ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నదంటే..
2022 ఏడాది బాలీవుడ్ కు వరుసగా చేదు జ్ఞాపకాల్ని మిగుల్చుతోంది. కానీ కియారా అద్వాణీకి మాత్రం ఈ ఇయర్ లక్ బాగా కలిసివచ్చింది. ఆమె నటించిన భూల్ భులయ్యా, జగ్ జగ్ జియో సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాయి. గోవింద్ నామ్ మేరా సినిమాతో థియేటర్లలో కియారా హ్యాట్రిక్ హిట్ అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ సంబరపడిపోయారు. కానీ అభిమానుల అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్లో ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గోవింద్ నామ్ మేరా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది. ప్రస్తుతం థియేటర్లలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సినిమాను డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించినట్లు తెలిసింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.
దాదాపు అరవై రెండు కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. కియారా అద్వాణీకి ఉన్న డిమాండ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని డిస్నీ ప్రతినిధులు భారీ ధరకు సినిమాను కొన్నట్లు సమాచారం. మరోవైపు ఉరి తర్వాత విక్కీ కౌశల్కు సరైన సక్సెస్ లేదు. అతడి గత చిత్రం సర్ధార్ ఉద్ధమ్ కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. త్వరలోనే గోవింద్ నామ్ మేరా రిలీజ్ డేట్ను రివీల్ చేయబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.