IND vs ENG Test Match: ఉప్పల్లో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్.. మ్యాచ్కు టికెట్స్తోపాటు మధ్యాహ్నా భోజనం ఫ్రీ
IND vs ENG Test Match Free Tickets: హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగే భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు టికెట్స్తోపాటు మధ్యాహ్నం ఉచితంగా భోజన సదుపాయం కల్పించనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. పూర్తి వివరాల్లోకి వెళితే..
India vs England Test 2024 Free Tickets: సాధారణంగా క్రికెట్ను స్టేడియంలో చూడాలంటే టికెట్స్ కొనుక్కుని చూడాలి. ఎలాంటి మ్యాచ్కు అయినా సరే టికెట్స్ కచ్చితంగా కొనాల్సిందే. కానీ, ఈసారి మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వినూత్న ఆలోచనతో ముందుకు రానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. కానీ, కొంతమందికే ఈ బంఫర్ ఆఫర్ ప్రకటించింది హెచ్సీఏ.
జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అందుకు తొలి మ్యాచ్కు ఉప్పల్ వేదికగా మారనంది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ భిన్నంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. అది అందరికీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లోని విద్యార్థులకు. తెలంగాణలో గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ను ఫ్రీగా చూడొచ్చని తెలిపింది.
అంతేకాకుండా మ్యాచ్ను ఉచితంగా చూడటంతోపాటు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. మ్యాచ్ జరిగే 5 రోజులు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందని హెచ్సీఏ పేర్కొంది. అయితే, స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థలు, వారి కోసం ఎంతమంది స్టాఫ్ వస్తున్నారో జనవరి 18లోపు ఆ స్కూల్ యాజమాన్యాలు హెచ్సీఏకు తెలపాలని వెల్లడించారు.
అందుకు హెచ్సీఏ సీఈవోకు ceo.hydca@gmail.comకు మెయిల్ ద్వారా గానీ, స్టేడియంలో గానీ తెలియజేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. టెస్ట్ మ్యాచ్ను కచ్చితంగా చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్లోనే స్టేడియంకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది హెచ్సీఏ. ఈ ఆఫర్తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నిండిపోనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే టెస్ట్ క్రికెట్కు ఆదరణ కూడా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఇక టీమిండియా కూడా జట్టు ప్రకటించాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ డీటేల్స్..
హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి జనవరి 29 మధ్య తొలి టెస్ట్ మ్యాచ్
విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 మధ్య రెండో టెస్ట్ మ్యాచ్
రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 మధ్య మూడో టెస్ట్ మ్యాచ్
రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 27 మద్య నాలుగో టెస్ట్ మ్యాచ్
ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి మార్చి 11 మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్
ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు ముందు.. ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11న తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 14, 17 తేదిల్లో మిగతా రెండు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఉప్పల్ స్టేడియంలో చివరిగా 2018లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.