Tirumala Temple Video : నెట్టింట శ్రీవారి ఆనంద నిలయం వీడియో వైరల్, టీటీడీ భద్రతా వైఫల్యమని భక్తులు ఆగ్రహం!
Tirumala Temple Video : తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ గుర్తుతెలియని భక్తులు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లి ఆనంద నిలయం వీడియోను తీశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Tirumala Temple Video : తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కొందరు వ్యక్తులు తిరుమల శ్రీవారి ఆలయం దృశ్యాలను డ్రోన్ తో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా శ్రీవారి ఆనంద నిలయం వీడియోను ఓ భక్తులు చిత్రీకరించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవారి ఆలయం లోపలికి సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అలాంటి ఓ భక్తులు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి సెల్ ఫోన్ ఆలయంలోకి తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించాడు.
ఆనంద నిలయం వీడియో వైరల్
సాధారంగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే మూడు ప్రదేశాల్లో భక్తులను తనిఖీ చేస్తారు. అయితే ఓ భక్తుడు భద్రతా సిబ్బందికి తెలియకుండా తనిఖీలన్నీ దాటుకుని సెల్ ఫోన్తో ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం శ్రీవారి ఆనంద నిలయాన్ని వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఈ వీడియో టీటీడీ దృష్టికి రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. సీపీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోపకి సెల్ ఫోన్ ను ఎలా అనుమతించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్, భద్రతా సిబ్బంది సెల్ ఫోన్ ను గుర్తించలేకపోవడంపై మండిపడుతున్నారు. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలపై భక్తులు అసంతృప్తితో ఉన్నారు.
శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్లు చక్కర్లు
శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఇటీవల మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భక్తులను ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. తిరుమలలో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేశారు. ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తూ తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా చక్కర్లు కొట్టినట్టు దర్యాప్తులో తేల్చారు.
డ్రోన్ వీడియో కలకలం
తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్, విమానాలు, ఇతర పరికరాలు ప్రయాణించడం నిషిద్ధం. అయితే ఇటీవల డ్రోన్ కెమెరాతో తిరుమల ఆలయాన్ని చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించడంపై దర్యాప్తు చేశారు. శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలకు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియా హైదరాబాద్ కు చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం సంచలనం అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు మండిపడ్డారు. ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవు. డ్రోన్ వీడియో చిత్రీకరణపై టీటీడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది.