Pawan Kalyan | కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవచ్చు కదా?
కోనసీమ జిల్లాకు పేరు మార్పుపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.
ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని.., కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించారని పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో ఉద్దేశం ఏంటి? అని ప్రశ్నించారు. జిల్లాలకు జాతీయ స్థాయి నాయకుల పేర్లను పెట్టడం జనసేన సమర్థిస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తిని పొట్టి శ్రీరాములను జిల్లాకు పరిమితం చేశారని.. పేర్లు పెట్టేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారని.. కృష్ణా నది ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు. జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. వైసీపీ దురుద్దేశం ఇట్టే అర్థమవుతోందన్నారు. గొడవలు జరగాలని వైసీపీ అనుకుందన్నారు. మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా? అని ప్రశ్నించారు.
'సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారు. వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోంది. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి? దాడి జరుగుతుందంటే ఇంటికి రక్షణగా ఉండాలి కదా? ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా?పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తారా? కులసమీకరణపై రాజకీయాలు చేస్తారా? భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు?' అని ప్రశ్నించారు.
మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపారని పవన్ అన్నారు. మృతదేహం తెచ్చి ఇంటికి తెచ్చి పడేశారని.. ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమలో గొడవలు రేపారన్నారు. కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచనేంటి? అని పవన్ అడిగారు. కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవచ్చు కదా? కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టేలా చూడాలని పవన్ కోరారు . మొదటి ఎస్సీ ముఖ్యమంత్రి పేరు పెట్టడం మంచిదని సూచించారు.
మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు పేరు పెడతామని చెప్పా. అంబేద్కర్ స్ఫూర్తిని అమలు చేయటం మాని వేరే పనులు చేస్తున్నారు. అంబేడ్కర్పై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సజావుగా అమలు చేయాలి. గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లు దారిమళ్లించారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన వాహనాలు ఇవ్వడం లేదు. ఎస్సీలకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటం ఆపేశారు. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనకు నిధులు ఇవ్వటం లేదు.
- పవన్ కల్యాణ్
రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు ఆజ్యం పోసిందని పవన్ అన్నారు. కోడి కత్తి ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని అడిగారు. వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలేంటి? అని ప్రశ్నించారు. కోడికత్తి కేసు సమయంలో ఏపీ పోలీసులను నమ్మేది లేదన్నారు. వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండని పవన్ హితవు పలికారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదన్నారు.
టాపిక్