Parent Name Issue in Admissions: అడ్మిషన్లలో తండ్రి పేరు కోసం ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Parent Name Issue in Admissions: పాఠశాలలో చేర్చే సమయంలో తప్పనిసరిగా తండ్రి పేరు మాత్రమే నమోదు చేయాలని పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్పై ‘‘రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్’’ జోక్యం చేసుకోవాలని స్వచ్ఛంధ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.
Parent Name Issue in Admissions: పాఠశాల అడ్మిషన్లకు తండ్రిపేరు తప్పనిసరి డిమాండ్ చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలల హక్కుల కమిషన్కు స్వచ్ఛంధ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. చిన్నారుల్ని పాఠశాలలో చేర్చే సమయంలో తప్పనిసరిగా తండ్రి పేరు మాత్రమే నమోదు చేయాలని పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్ల వల్ల వందలాది మంది బాలలు చదువుకునే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్ జోక్యం చేసుకొని బాలల భవిష్యత్తు కాపాడాలని అక్రమ రవాణా భాదిత మహిళలు మరియు వ్యాపార లైంగిక దోపిడి బాధితుల రాష్ట్ర సమాఖ్య నాయకులు కోరారు.
విముక్తి సంస్థ తరపున ప్రతినిధులు మంగళగిరిలోని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్ చైర్మన్ కేసలి అప్పారావుకు ఒక వినతి పత్రం అంద జేశారు. రాష్ట్ర ఎయిడ్స్ నివారణా శాఖ అధికారిక లెక్కలు ప్రకారం రాష్ట్రంలో 1.33 లక్షల మంది మహిళలు వేశ్యా వృత్తిలో మగ్గుతున్నారని అనధికారికంగా ఈ సంఖ్య రెండు రెట్లు ఉండవచ్చని స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నారు.
ఈ వృత్తిలో ఉన్న వారిలో 75% మందికి పిల్లలు ఉన్నారని వారిలో 14 సం॥లోపు పిల్లల్లో 57.61% మంది పిల్లలు మాత్రమే పాఠశాలకు వెళ్తున్నారని గణాంకాలతో పేర్కొన్నారు. మిగిలిన వారు తమ తండ్రి ఎవరో తెలియక, పట్టించుకొనే వారు లేక వీధి బాలలుగా, బాల కార్మికులుగా, జులాయిగా తిరుగుతూ ఉన్నారని 2018లో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన సాంపుల్ సర్వేలో వెళ్ళడైనట్లు కమిషన్కు వివరించారు.
చాలామంది మహిళలు భర్తల దౌర్జన్యం, హింస తట్టుకోలేక ఆ కుటుంబం బయటకు వచ్చిన వారు ఉన్నారని, మరికొంత మంది విడాకులు పొంది ఉన్నవారు, కొంతమంది మోసపోయి పిల్లలను కన్నవారు ఉన్నారని, ఇలాంటి మహిళలు తమ పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడానికి పాఠశాలల యాజమాన్యం తండ్రి పేరు తప్పక ఉండాలి అని, కొందరికి పుట్టిన ధృవ పత్రంలో ఒక తండ్రి పేరు, ఆధార్ కార్డుల్లో మరో పేరు ఉన్నందున తాము అనుమతించమని అంటున్నారని వివరించారు.
2015లో సుప్రింకోర్టు బర్త్ సర్టిఫికేట్లో తండ్రిపేరు ఉండాలని ఒత్తిడి చేయవద్దని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిందని, 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం, 2018లో మద్రాస్ హైకోర్టు, 2019లో గోవా ప్రభుత్వం, డిల్లీ ప్రభుత్వం, ప్రభుత్వ,`ప్రైవేట్ పాఠశాలల్లో చేరే విధ్యార్ధులకు తప్పనిసరిగా తండ్రి పేరు ఉండాలని ఒత్తిడి లేకుండా తల్లి అనుమతి మేరకు ఆమె పేరు నమోదు చేయవచ్చని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నూరు శాతం పిల్లలు అందరూ నాణ్యమైన విధ్య అందించేందుకు నాడు`నేడు, అమ్మవడి, విధ్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న తరుణంలో అక్రమ రవాణా బాధిత మహిళలు, ఒంటరి మహిళలు, విడాకులు పొందిన వారు, సెక్స్ వర్కర్ల పిల్లలను పాఠశాలల యాజమాన్యం, హెడ్ మాస్టర్లు తల్లి అనుమతి మేరకు తల్లి పేరు మాత్రమే నమోదు చేసుకొనేలా రాష్ట్ర విద్యా శాఖ ద్వారా తగిన ఆదేశాలు పాఠశాలలకు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు విముక్తి సంస్థ ప్రతినిధులు రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్కు వినతి పత్రం సమర్పించారు.