Tirumala Darshan Tokens : సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుమలకు భారీగా భక్తులు
Tirumala Darshan Tokens : వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. జనవరి 1 నుంచి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో టీటీడీ దర్శన టోకెన్లు జారీ చేయనుంది.
Tirumala Darshan Tokens : కొత్త ఏడాదిలో శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అందులోను వైకుంఠ ద్వారం ద్వారా ఏడుకొండల వాడిని దర్శించడాన్ని అదృష్టంగా భావిస్తారు. దర్శన భాగ్యాన్ని పొందేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా.. దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో.... వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని.. ఈ సమయంలో సర్వదర్శనం కోసం వచ్చే వారి కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో జనవరి 1 నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేశామని టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టోకెన్లను పొంది... శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. తిరుపతి భూదేవీ కాంప్లక్స్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠద్వార టోకెన్లు ఇస్తామని టీటీడీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో... ఆ సమయానికి భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్... రైల్వేస్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం... రైల్వేస్టేషన్ వెనుక గల 2,3 సత్రాలు... ఆర్టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్.... ఇందిరా మైదానం... జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్.... భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్... ఎంఆర్ పల్లి జడ్పి హైస్కూల్.... రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో జనవరి 1వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ సిద్ధమైంది. రోజుకు 50 వేల చొప్పున 10 రోజులకు ఐదు లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయనుంది. టోకెన్లు ముగిసే వరకు నిరంతరాయంగా కౌంటర్లు తెరిచే ఉంచుతామని వెల్లడించింది. తిరుపతిలో టోకెన్లు పొందాకే భక్తులు తిరుమలకు రావాలని.. టోకెన్లు కలిగిన భక్తులను దర్శన సమయానికి అర్ధగంట ముందు మాత్రమే క్యూ లైన్ లోకి అనుమతిస్తామని తెలిపింది.
కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొత్త ఏడాది జనవరిలో పలు వేడుకలు జరగనున్నాయి. విశేష పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు.. తేదీల వారీగా జరగనున్న వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది.
జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ పేర్కొంది. జనవరి 2వ తేదీన తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని వెల్లడించింది. జనవరి 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి, శ్రీవారి చక్రస్నానం.... జనవరి 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.... అదే రోజు నుంచి 13 వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం... జనవరి 14న భోగీ పండుగ.... జనవరి 15న తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం, మకర సంక్రాంతి.... జనవరి 16న కనుమ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేం చేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేం చేపు... శ్రీ గోదా పరిణయోత్సవం జరుగుతాయి. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం మరియు వసంత పంచమి వేడుకలు... జనవరి 28న రథసప్తమి నిర్వహిస్తారు.