Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం… ఏపీ, తెలంగాణలలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతోంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలుల ప్రభావం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
పొంగి ప్రవహిస్తున్న నదులు…
ఏపీలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి నదులకు జులై, ఆగష్టు నెలల్లోనే వరదలు పోటెత్తాయి. గత నెల వరద ముంపు నుంచిప్రజలు తెరుకోక ముందే మరోసారి గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.70 లక్షల క్యూసెక్కులుగా ఉండటంతో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల్ని వేగవంతం చేశారు. కొద్ది రోజుల క్రితమే సర్వం కోల్పోయిన జనానికి మళ్లీ గోదావరి ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని ఏపీ విపత్తుల నివారణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 3.37లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద పెరిగే కొద్ది ముంపు గురికాబోయే ప్రభావిత ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్ని జల కళ సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజీకి దిగువన నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో ఆ నీరంతా సముద్రంలోకి వదులుతున్నారు.
టాపిక్