శ్రీకాళహస్తి బ్యాంకు దోపిడీలో వీడిన మిస్టరీ....
చిత్తూరులో సంచలనం సృష్టించిన బ్యాంకు దోపిడీ ఘటనను పోలీసులు చేధించారు. బ్యాంకు ఉద్యోగి సహకారంతోనే దోపిడి జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఫైనాన్స్ బ్యాంకు సిబ్బందిని కత్తులు, ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించి దోచుకున్న ఘటనలో బ్యాంకు మేనేజరే నిందితుడిగా గుర్తించారు.
శ్రీకాళహస్తి పట్టణంలో స్మాల్ ఫైనాన్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ప్రైవేట్ బ్యాంకు దోపిడీ వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. గత వారం బ్యాంకులోకి ఆయుధాలతో ప్రవేశించిన నిందితులు కత్తులతో క్యాషియర్ను బెదిరించి రూ.5లక్షల నగదు, 80లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. గతగురువారం ఉదయం 10.40కు బ్యాంకు పనివేళలు ప్రారంభమైన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇద్దరు ఉద్యోగులు మాత్రమే బ్యాంకులో విధుల్లో ఉన్నారు. ఇంగ్లీషులో మాట్లాడుతున్న ముగ్గురు యువకులు బ్యాంకులోకి ప్రవేశించి, క్యాషియర్ను బెదిరించి లాకర్ను తెరిపించారు. లాకర్లో ఉన్న నగదు, నగలను దోచుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాథ్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు.
దోపిడి ఘటన దర్యాప్తులో పోలీసులు బ్యాంకు మేనేజర్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దోపిడి ఎపిసోడ్ మొత్తాన్ని సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని సూత్రధారిగా తేల్చారు. శ్రీకాళహస్తి బ్యాంకులో ఆడిట్ నిర్వహించేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమాచారం తెలియడంతో బ్యాంకు మేనేజర్ దోపడికి స్కెచ్ వేశాడు. బ్యాంకులో తనఖా పెట్టిన నగల్లో ఎక్కువ భాగం నకిలీవే ఉండటంతో ఆడిట్లో తన తప్పు బయట పడుతుందనే ఉద్దేశంతో చెన్నైకు చెందిన వ్యక్తులతో కుట్రపన్నాడు. నకిలీనగలను బ్యాంకుకు తాకట్టు పెట్టి బ్యాంకు సొమ్మును కాజేసిన సంగతి బయటపడకుండా ఉండటానికి పథకం రచించాడు. ఇందు కోసం చెన్నై నుంచి ముగ్గురు కిరాయి వ్యక్తులతో మాట్లాడుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో కేసు చిక్కుముడి వీడిపోయింది. ఆడిట్ నుంచి బయటపడటానికి దోపిడి నాటకం ఆడినట్లు ఒప్పుకోవడంతో రికవరీ ప్రయత్నాలు ప్రారంభించారు.
టాపిక్