Rahul on ED questioning | `సహనం కాంగ్రెస్ రక్తంలోనే ఉంది`
22 June 2022, 17:32 IST
ఐదు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తొలిసారి ఆ విషయంపై స్పందించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో బుధవారం మాట్లాడుతూ.. చివరి రోజైన ఐదో రోజు ఈడీ అధికారులు తనను ఒక ప్రశ్న అడిగారని వెల్లడించారు. `ఇన్ని రోజులు, ఇన్ని గంటల పాటు ప్రశ్నించాం కదా! అన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చారు. ఇంత ఓపిక, సహనం మీకు ఎలా వచ్చింది?` అని ఈడీ అధికారులు తనను ప్రశ్నించారని రాహుల్ వెల్లడించారు. ఆ ప్రశ్నకు తాను ఇలా సమాధానమిచ్చానన్నారు. `నేను 2004 నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్ వారిలో ఓర్పు, సహనం సహజంగానే ఉంటాయి` అని తాను వారికి సమాధానమిచ్చానని రాహుల్ వివరించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో 5 రోజుల పాటు, దాదాపు 50 గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్ను ప్రశ్నించారు.