January 27 Telugu News Updates : నటుడు తారకరత్నకు అస్వస్థత..
27 January 2023, 18:59 IST
- కుప్పం నుంచి ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న... నటుడు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. లోకేశ్ తోపాటు తారకరత్న కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదు వద్దకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు. వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ హాస్పిటల్ కు తరలించగా.... వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం.. పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి….
బీఆర్ఎస్ లోకి ఒడిశా నేతలు..
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన సతీమణి, కుమారుడు కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఒడిశాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా కారెక్కారు. ఈ సందర్భంగా నేతలకు స్వాగతం తెలిపిన కేసీఆర్... గిరిధర్ గమాంగ్ నేతృత్వంలో ఒడిశాలో పార్టీ వేగంగా విస్తరిస్తుందని అన్నారు. దేశంలో స్థితిగతులు మార్చి.. అభివృద్ధి చేసేందుకే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
మరిన్ని కొలువులు..
రాష్ట్రంలో కొలువుల భర్తీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు విభాగాలు, శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి.. నియామక ప్రక్రియ చేపడుతోన్న సర్కార్.. మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. టీఎస్పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. బీసీ గురుకులాల్లో 1,499 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 166.. బీసీ గురుకులాల్లో 141 జూనియర్ అసిస్టెంట్.. సహా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులకు అనుమతి ఇస్తూ... ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్ వారీగా లెక్కలు తేలిన తర్వాత ఆయా పోస్టులకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
నారా లోకేశ్..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ జగన్... 3 ఏళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్... సీఎం జగన్, వైఎస్సార్సీపీ మంత్రులపై ధ్వజమెత్తారు. యువకులు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, మహిళలు... ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేతిలో బాధితులుగా మారారని అన్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని.. ఉద్యమిస్తే జైళ్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను అన్ని విధాలా మోసం చేశారని విమర్శించారు. వేలాది మంది యువకులు తమ ఆవేదనను తనతో చెప్పారని.. వారి కష్టాలు తీర్చేందుకే తాను యువగళం పాదయాత్ర ప్రారంభించానని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పోరాడేందుకు యువగళం పాదయాత్ర.. యువతకు అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు.
అస్వస్థతకు గరైన తారకరత్న…
కుప్పం నుంచి ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న... నటుడు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. లోకేశ్ తోపాటు తారకరత్న కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదు వద్దకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు. వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ హాస్పిటల్ కు తరలించగా.... వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం.. పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
బెయిల్
దిల్లీ లిక్కర్ స్కామ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. శరత్చంద్రారెడ్డి నానమ్మ అంత్యక్రియల దృష్ట్యా బెయిల్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కీలక భేటీ
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ పరిణామం కొడంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న గురునాథ్ రెడ్డిని రేవంత్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. గురునాథ్ రెడ్డితో పాటు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ముద్దప్ప కూడా బీఆర్ఎస్ ను వీడి.. హస్తం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా అధికార బీఆర్ఎస్ కు షాక్ తలగటం ఖాయమనే చర్చ జోరుగా నడుస్తోంది.
యాత్ర ప్రారంభం
Nara Lokesh Yuvagalam తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో ఉన్న శ్రీ వరదరాజస్వామి ఆలయంలో లోకేష్, బాలకృష్ణ, అచ్చన్నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11.03గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు.
భేటీ
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
దరఖాస్తుల టైం
'మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు మార్చి ఒకటో తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఎంపికైన బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. విద్యార్థులు వీసా, పాస్పోర్ట్ కాపీతోపాటు, ఆధార్కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్కొరియా దేశాల్లో ఉన్నత విద్యావకాశం పొందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నిబంధనలు వర్తిస్తాయి.
భారీ జెండా
భద్రకాళి బండ్పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ గురువారం ఈ జెండాను ఆవిష్కరించారు.
సరికొత్త ప్యాకేజీ
హైదరాబాద్ నుంచి షిర్డీకి తాజా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
యాత్ర
Nara Lokesh Yuvagalam తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. కుప్పం చేరుకున్న నారా లోకేష్ ఉదయం 11.03 గంటలకు తన పాదయాత్రలో తొలి అడుగు వేయనున్నారు. కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన నారా లోకేష్ ఉదయం 10.15 గంటలకు వరదరాజుల స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం 4 వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర కు తొలి అడుగులు వేయనున్నారు.
భారీ సభ
BRS Public Meeting in Nande: తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేలా పక్కాగా పావులు కదుపుతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలు పార్టీలోకి రావటం.. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించటంతో పాటు త్వరలోనే సభకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మరో సరిహద్దు రాష్ట్రంలోనూ విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. వచ్చే నెలను ఇందుకు ముహుర్తంగా ఫిక్స్ చేశారు.
నేటి నుంచే
నేటి నుంచి తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రక్రియ షురూ కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ జీవో నెంబరు 5 జారీ చేశారు. ఖాళీల వివరాలను జనవరి 27వ తేదీన ప్రకటిస్తారు. ఈనెల 28 నుంచి ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4వరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుందని షెడ్యూల్ లో వివరించారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ఉంటాయి.