125 Feet Ambedkar Statue : అంబేడ్కర్ ఆశయాలను KCR ముందుకు తీసుకెళ్తున్నారు - ప్రకాశ్ అంబేడ్కర్
14 April 2023, 17:03 IST
- Ambedkar Statue unveiling Live Updates: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ వేదికైంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. లైవ్ అప్డేట్స్ కోసం పేజీని రిఫ్రెష్ చేయండి…
విప్లవం - సీఎం కేసీఆర్
అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం . ఎవరో అడిగితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం. ఇక్కడికి దగ్గర్లోనే అమరవీరుల స్మారకం ఉంది. విగ్రహా ఏర్పాటులో పాలుపంచుకున్న వారికి అభినందనలు తెలుపుతున్నాను. అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అావార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. ఉత్తమ సేవలు అందించినవారికి అావార్డులు ఇస్తాం. ఇందుకోసం రూ. 50 కోట్ల నిధులు కేటాయిస్తాం. ఏటా అంబేడ్కర్ జయంతి రోజు ప్రదానం చేస్తాం. ఇక్కడ ఏర్పాటు చేసింది విగ్రహం కాదు... విప్లవం. దళితబంధు వంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చాం. రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. మనందరికీ మార్గదర్శం చేసేలా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు చేశాం" అని కేసీఆర్ గుర్తు చేశారు.
ముందుకెళ్లాలి - సీఎం కేసీఆర్
అంబేడ్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు చేయటం కాదు... ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు సీఎం కేసీఆర్. 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిపోయిందన్నారు.
ప్రకాశ్ అంబేడ్కర్ ప్రసంగం..
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయటంపై ప్రకాశ్ అంబేడ్కర్ హర్షం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి అన్నారు. సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదన్న ఆయన... రూపాయి సమస్యలపై 1923లోనే అంబేడ్కర్ పరిశోధన పత్రం రాశారని గుర్తు చేశారు, దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.
కేసీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏపీ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేశారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పెద్ద పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్ మద్దతు ఇచ్చారు. హైదరాబాద్ రెండో రాజధానిగా కూడా అంబేడ్కర్ సమర్థించారు" అని వెల్లడించారు.
అంబేద్కర్ స్ఫూర్తితో పాలన
“తెలంగాణలో అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగుతోంది.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ విగ్రహ నిర్మాణంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు చేశారు.. దానికి అనుగుణంగా విగ్రహం అద్భుతంగా తీర్చిదిద్దారు” అని మంత్రి కొప్పులు ఈశ్వర్ అన్నారు.
సీడీ ఆవిష్కరణ..
దళితబంధు విజయగాథల సీడీని ప్రకాశ్ అంబేడ్కర్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతంర ప్రకాశ్ అంబేడ్కర్ ప్రసంగించారు.
సభ ప్రారంభం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్వాగత ఉపన్యాసం చేశారు. ఆ తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు.
విగ్రహావిష్కరణ
125 అడుగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారంతో పాటు మంత్రులు పాల్గొన్నారు.
పూలవాన
125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు.
చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ వేదిక వద్దకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
సందడిగా పరిసర ప్రాంతాలు..
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఇప్పటికే మంత్రులు చేరుకోగా… కాసేపట్లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ వేదికకు చేరుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ప్రత్యేక బస్సులు
కాసేపట్లో విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ అంబేడ్కర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చేలా ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
లబ్ధిదారులతో మాట ముచ్చట
దళితబంధు పథకం దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నానని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో దళితబంధు యూనిట్లను మంత్రి గంగుల కమలాకర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పథకం లబ్దిదారులతో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు.
అంబేడ్కర్ వల్లే రాష్ట్రం…
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పంజాగుట్ట కూడలిలో ఆయన విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ ఆవిష్కరించారు
విశాలమైన పార్కింగ్…
బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్ కూడా ఉంది. మొత్తం ఫాల్స్ సీలింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ స్మృతి వనంలో దాదాపు 450 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది.
మొత్తం వ్యయం రూ.146 .50 కోట్లు…
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహం రూపకల్పన చేశారు. మొత్తం వ్యయం రూ.146 .50 కోట్లు. పని చేసిన శ్రామికులు 425 మంది. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజి సుతార్. 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం. అంబేద్కర్ స్మృతివనంలో రాక్ గార్డెన్ నిర్మించారు.
అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం…
ఇది దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం పనులు చేపట్టారు. బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు. వినియోగించిన స్టీల్ 791 టన్నులు. ఇత్తడి 96 మెట్రిక్ టన్నులుగా ఉంది
ముఖ్య అథితిగా
ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ప్రత్యేక అతిధిగా హాజరవుతారు. ఈ విగ్రహ స్థాపనకు ఏప్రిల్ 14 , 2016 లో శంకు స్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం. భూమి నుండి 175 అడుగుల ఎత్తు. పీఠం ఎత్తు 50 అడుగులుగా ఉంది.