Ganesh Immersion live Updates: హైదరాబాద్లో వర్షం.. కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం
28 September 2023, 18:37 IST
- Ganesh Immersion live Updates: హైదరాబాద్లో గణేష్ విగ్రహాల శోభయాత్ర ప్రారంభమైంది. వీధివీధి నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. రేపు ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం గురువారం మధ్యాహ్నం పూర్తి అయింది.
ఓవైపు వర్షం.. మరోవైపు నిమజ్జనాలు
భాగ్యనగరంలో వర్షం కురుస్తోంది.ఓవైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వర్షం కురుస్తుండటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. బషీర్బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, హిమాయత్నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్పైకి తరలి వస్తున్నాయి.
గంగమ్మ చెంతకు బాలాపూర్ గణపతి
బాలాపూర్ గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. ట్యాంక్బండ్పై 13 నంబర్ క్రేన్ వద్ద బాలాపూర్ గణేశ్ నిమజ్జనం పూర్తి అయింది.
సాగర్ వరకు బాలాపూర్ గణేశుడు
ట్యాంక్ బండ్ వద్దకు కొద్దిసేపటి క్రితం బాలాపూర్ గణేశుడు చేరుకున్నాడు. మరికాసేపట్లో బాలపూర్ గణనాథుడి నిమజ్జనం కానుంది.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
నాయక చవితి వేడుకలు ముగిశాయి. భక్తజన కోలాహాలం మధ్య గణనాథులు… తల్లి గంగమ్మ ఒడికి చేరాయి. ఇక ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ముగిసింది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన శోభాయాత్ర హుస్సేన్సాగర్ వరకు ఘనంగా సాగింది. మధ్యాహ్నం 1 గంటల తర్వాత…. ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు.
సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ గణేషుడు
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం మరికాసేపట్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కానుంది. భారీ క్రేన్ల సాయంతో విగ్రహాన్ని సాగర గర్భానికి చేర్చారు. ట్రాలీ నుంచి విడదీపిన విగ్రహాన్ని సాగర్ ఒడిలోకి చేరుస్తున్నారు. గతంలో ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనానికి చాలా సమయం పట్టేది. తెల్లవారు జాము నుంచి విగ్రహ తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ ల మీదుగా విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తరలించారు. 63 అడుగుల మట్టి విగ్రహాన్ని సాగర గర్భంలో కలుపుతున్నారు.
హుస్సేన్ సాగర్ చేరుకున్న మంత్రి తలసాని
హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం తరలి వచ్చిన ఖైరతాబాద్ వినాయకుడిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. వేగంగా విగ్రహ నిమజ్జనం చేయడం కోసం ఉత్సవ కమిటీ కూడా సహకరిస్తున్నట్లు చెప్పారు. గతంలో అర్థరాత్రి వరకు యాత్ర సాగేదని ఇతర సమస్యలు దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ముందే నిమజ్జనం చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో 90వేల విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శాంతిభద్రతల కోసం పోలీసులు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
గేట్ నంబర్ 4 చేరుకున్న ఖైరతాబాద్ గణనాథుడు
నిమజ్జనం కోసం ఖైరతాబాద్ గణనాధుడు హుస్సేన్ సాగర్ చేరుకున్నారు. గేట్ నంబర్ 4 సమీపంలో ఏర్పాటు చేసిన భారీ క్రేన్ ద్వారా విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. భారీ ట్రాలీపై ఉన్న విగ్రహాన్ని ఐరన్ గడ్డర్లతో వెల్డింగ్ చేశారు. వాటిని విడదీసిన తర్వాత నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
సెక్రటేరియట్ దాటిన గణనాధుడు
ఖైరతాబాద్ గణనాథుడు కొత్త సచివాలయ ప్రాంగణం మీదుగా ఎన్టీఆర్ మార్గ్లోకి చేరుతోంది. గత ఏడాదితో పోలిస్తే త్వరగానే ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ముగియనుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన గేట్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నారు.
27లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ
బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన లడ్డూ వేలం పాటలో దాసరి దయానంద రెడ్డి 27లక్షలకు లడ్డూను పాడుకున్నారు. గత ఏడాది రూ.24.60లక్షలకు లడ్డూ వేలం జరిగింది.
సిటీలో 535 ప్రత్యేక బస్సులు
గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో సిటీ లో 535 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నిమజ్జన శోభాయాత్ర అంతటా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వివిధ మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణేశ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన సహాయం కోసం ప్రయాణికులు బస్ స్టేషన్ను 9959226154 నంబర్లో, కోఠి బస్ స్టేషన్లో 9959226160 నంబర్లో సంప్రదించాలని రద్దీ ప్రాంతాల్లో సంబంధిత DMలు అందుబాటులో ఉండాలని, పోలీస్ అధికారులతో వారిని సమన్వయం చేసుకోవాలని కోరారు.
బస్సుల దారి మళ్లింపు
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం,శోభాయాత్ర సందర్భంగా జిల్లాల నుండి ట్యాంక్ బండ్ మీదుగా MGBS వచ్చే బస్సులను దారి మళ్లించినట్లు టిఎస్అర్టిసి ఎండీ సజ్జానార్ తెలిపారు. కరీంనగర్ వైపు నుంచి వచ్చే బస్సులు JBS, YMCA, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్ ఘట్ మీదుగా MGBS వెళ్తయని వెల్లడించారు.బెంగళూర్ వైపు నుంచి వచ్చే బస్సులు ఆరంఘర్ క్రాస్ రోడ్స్,చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, IS సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘట్ మీదుగా నడుస్తాయన్నారు.ముంబై వైపు నుంచి వచ్చే బస్సులు గోద్రెజ్ వై జంక్షన్, నర్సాపూర్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, JBS, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా మీదుగా వెళ్తాయి అని తెలిపారు.గురువారాం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మాత్రమే పైన పేర్కొన్న రూట్లో బస్సుల దారి మళ్లింపు ఉంటుందని ఆ తర్వాత యథావిధిగా నడుస్తాయన్నారు.
బాలాపూర్ లడ్డూ వేలానికి భారీగా పోటీ
బాలాపూర్ లడ్డూ వేలంలో ఏడుగురు కొత్తవారు లడ్డూ వేలంలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. రూ.25లక్షల రుపాయలు అడ్వాన్స్ చెల్లించారని, వేలంలో అధిక మొత్తం చెల్లించిన వారికి లడ్డూ అందించనున్నారు.
రాజ్ దూత్ హోటల్ సమీపంలో గణేశుడు
ఖైరతాబాద్ గణేశుడు రాజ్దూత్ హోటల్ సమీపంలోకి చేరుకున్నాడు. ఈ ఏడాది నిర్ణీత సమయానికి విగ్రహ నిమజ్జనం పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా విగ్రహం ముందుకు సాగుతోంది. ఉదయం ఆరుగంటలకే ఖైరతాబాద్ విగ్రహం ముందుకు కదిలింది.
100 ప్రాంతాల్లో నిమజ్జనం ఏర్పాట్లు
హైదరాబాద్లో మహా నిమజ్జనం సందడి మొదలైంది. హుస్సేన్సాగర్ సహా సుమారు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య బడా గణేశుడు ముందుకు సాగుతున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్సాగర్లో మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది.
నిమజ్జనం ప్రదేశాల్లో పార్కింగ్ ఇక్కడే
ట్యాంక్ బండ్లో నిమజ్జాలను చూసేందుకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక సెంటర్లు సిద్ధం చేశారు. సాగర్ చుట్టూ ఉండే ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల్లోనే విజిటర్స్ వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయం, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్లో పార్కింగ్ కేంద్రాలు ఉన్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.
కుషాయిగూడ పిఎస్ పరిధిలో నిమజ్జనాలు
కాప్రా ట్యాంక్ గణేశ్ విగ్రహ నిమజ్జనాలు కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోకి జరుగుతాయి.
భాస్కర్ రావు నగర్: నేతాజీ నగర్ వైపు వెళ్లే సాధారణ ప్రజల కోసం భాస్కర్ రావు నగర్ బస్ స్టాప్ వద్ద 27 అవెన్యూ రోడ్డు, సైనిక్పురి డైవర్షన్ పాయింట్ పెట్టారు.
నేతాజీ నగర్ X రోడ్డు : పాత కాప్రా నుంచి యాప్రాల్ వైపు వెళ్లే సాధారణ ప్రజల కోసం.... నేతాజీ నగర్ X రోడ్డు వద్ద కెనరా జంక్షన్ వైపు డైవర్షన్ పాయింట్ పెట్టారు.
కొనసాగుతున్న శోభాయాత్ర
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ముందుకు సాగుతోంది. అర్థరాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ చేసి ఖైరతాబాద్ గణేష్ను ముందుకు కదిలించారు. విగ్రహాన్ని ట్రాలీపైకి ఎక్కించి వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. మధ్యాహ్నం 1.30కి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెం.4లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగనుంది.
పదిన్నర లోపు బాలాపూర్ లడ్డూ వేలం
బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్న లడ్డూ వేలం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామంలో విగ్రహ ఊరేగింపు తర్వాత బొడ్రాయి సమీపంలో లడ్డూ వేలం నిర్వహించనున్నారు. గత ఏడాది రూ.24.60లక్షలకు లక్ష్మణ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో పాల్గొనేందుకు రూ.5వేలు చెల్లించి వేలంలో పాల్గొనేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
ఖైరతాబాద్ నుంచి మొదలైన శోభాయాత్ర
63అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ దశమహా గణపతి విగ్రహం నిమజ్జనం కోసం బయల్దేరింది. ఖైరతాబాద్ నుంచి వేలాది మంది భక్తజనుల నడుమ గణనాధుడు బయల్దేరాడు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో నిమజ్జనం…
సఫిల్గూడ ట్యాంక్ గణేష్ విగ్రహ నిమజ్జనం మల్కాజ్గిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉంటుంది.
మెట్టుగూడ టి జంక్షన్ (హైదరాబాద్ నగర సరిహద్దులు) : మెట్టుగూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్ రోడ్డు వైపు భారీ వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు లాలాపేట్ వైపు మళ్లిస్తారు. ప్రజలు లాలాపేట్, ZTC-HB కాలనీ- రమాదేవి-ECIL మీదుగా నేరేడ్మెట్కు ప్రయాణించవచ్చు.
ఆనంద్బాగ్ ఎక్స్ రోడ్ : మల్కాజిగిరి ఎక్స్ రోడ్ నుంచి సాధారణ ట్రాఫిక్ను అనుమతించరు. సఫిల్గూడ జంక్షన్, ఉత్తమ్ నగర్ , ZTC వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ప్రజలు వినాయక్ నగర్ వైపు వెళ్లాలని అనుకుంటే ZTC-మౌలాలి కమాన్, రమాదేవి- ECIL-రాధిక X రోడ్ - నేరేడ్మెట్- వినాయక్ నగర్ మీదుగా వెళ్లవచ్చు.
ఉత్తమ్ నగర్ RUB - AOC ప్రాంతం నుంచి సాధారణ ట్రాఫిక్ అనుమతించరు. ఆనంద్ బాగ్ , గౌతమ్ నగర్ వైపు మళ్లిస్తారు. సాధారణ ప్రజానీకం
మల్కాజిగిరి వైపు వెళ్లాలనుకునే వారు గౌతమ్ నగర్ - అనుటెక్స్ , మల్కాజిగిరి ఎక్స్ రోడ్ మీదుగా వెళ్లవచ్చు.
పార్కింగ్ స్థలాలు ఇవే…
నిమజ్జనం చూసేందుకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను జ్యోతి క్లబ్/సరస్వతి శిశు మందర్, ZPHS పాఠశాల సరూర్నగర్, పోస్టాఫీసు సమీపంలో (గాంధీ విగ్రహం దగ్గర) పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందిర ప్రియదర్శిని పార్క్ వద్ద అధికారుల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇతర వాహనాలను పార్కింగ్ చేయడానికి అనుమతించరు.
i) గణేష్ విగ్రహాల నిమజ్జనం తర్వాత అన్ని ఖాళీ వాహనాలు ఇందిర ప్రియదర్శిని పార్కు, సరూర్నగర్ పాత పోస్టాఫీసు X రోడ్, కర్మన్ఘాట్ వైపు లేదా సరూర్నగర్ పోస్టాఫీసు వైపు మాత్రమే వెళ్లాలి.
ii) సరూర్నగర్ పోస్టాఫీసు మీదుగా సరూర్నగర్ ట్యాంక్ వైపు వాహనాలు అనుమతించరు.
హైదరాబాద్లో రూట్ ఇదే…
హైదరాబాద్ వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలకు మార్గం
చాదర్ఘాట్, మలక్పేట్ సైడ్ వాహనాలు మూసారంబాగ్ టీవీ టవర్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలి. కోణార్క్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గర యూ టర్న్ తీసుకోని గడ్డి అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. శివ గంగా థియేటర్, శంకేశ్వర్ బజార్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
అంబర్పేట్, మూసారాంబాగ్ సైడ్ వాహనాలు మూసారాంబాగ్ టీవీ టవర్ X రోడ్ వద్ద లెఫ్ట్ తీసుకుని దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లాలి. కోణార్క్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గర యూటర్న్ తీసుకుని గడ్డి అన్నారం ఎక్స్ రోడ్ వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. శివగంగ థియేటర్, శంకేశ్వర్ బజార్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
సాగర్ రోడ్డులో ఆంక్షలు ఇవే…
నాగార్జున సాగర్ రోడ్డు వైపు వాహనాలు.. ఎల్బీ నగర్ జంక్షన్ మీదుగా కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ తర్వాత ఎడమ మలుపు తీసుకుని శివ గంగా తర్వాత మళ్లీ లెఫ్ట్ తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
కర్మన్ఘాట్ వైపు (శ్రీనివాస కాలనీ, మధురా నగర్, బైరామల్గూడ, దుర్గా నగర్)
వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్ J.C బ్రదర్స్ షోరూమ్, శివ గంగా థియేటర్ తర్వాత ఎడమవైపు మలుపు తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు మరలాలి.
సరూర్ నగర్ మార్గంలో ఆంక్షలు
వనస్థలిపురం నుంచి వచ్చే వాహనాలు-పనామా గోడౌన్ X రోడ్, ఎల్బీ నగర్ మీదుగా కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, జేసీ బ్రదర్స్ తర్వాత ఎడమ వైపు శివగంగా థియేటర్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
సరూర్నగర్ వాహనాలు - కొత్తపేట ఎక్స్ రోడ్డు మీదుగా వెళ్లి లైఫ్ట్ తీసుకోవాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ వద్ద లెఫ్ట్ తీసుకుని శివ గంగా థియేటర్ వద్ద మళ్లీ లెఫ్ట్ తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి
హయత్ నగర్, వనస్థలిపురం మార్గాల్లో ఇలా…
హయత్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట మీదుగా వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ తర్వాత ఎడమ వైపు తిరగాలి. శివ గంగా థియేటర్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్నగర్ ట్యాంక్ వైపు మరలాలి.
ఎల్బీ నగర్ నుంచి వచ్చే గణేశ్ నిమజ్జన వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట మీదుగా వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్, తర్వాత ఎడమ మలుపు తీసుకోవాలి. శివ గంగా థియేటర్ వద్ద ఎడమవైపు సరూర్నగర్ ట్యాంక్ కు వెళ్లాలి.
ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సరూర్నగర్ ట్యాంక్ లో గణేశ్ విగ్రహ నిమజ్జన ప్రక్రియ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసుల నియంత్రణలో ఉంటుంది.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకలకు అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే గణేశ్ విగ్రహాలు గంగమ్మ ఒడికి బయలుదేరనున్నాయి. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేశ్ శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లు
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్థరాత్రి వరకు పనిచేయనున్నాయి. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్లో కోలాహలం
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో కోలాహలం నెలకొంది. అన్ని ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్బండ్ వద్ద పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 ప్రాంతాల్లో 36 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో 64 చెరువుల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. నగరంలో 20వేల సిసి కెమెరాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలంపై ఆసక్తి
వినాయక చవితి సందర్భంగా నిర్వహించే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది 25లక్షలకు పైగా ధర లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున గజఈతగాళ్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. హుస్సేన్ సాగర్ లో దాదాపు 200మందిని గణేష్ నిమజ్జనం కోసం వినియోగిస్తున్నారు.
గేట్ నంబర్ 4లో ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం
శోభయాత్ర కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం బయల్దేరాయి. మధ్యాహ్నం 12లోపు ఎన్టీఆర్ ఘాట్ గేట్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.