Telugu News Updates October 19 : జనసేన నేతలకు షాక్ - బెయిల్ పిటిషన్ కొట్టివేత
19 October 2022, 22:26 IST
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా వార్తలు కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి..
గుర్రపు స్వారీ…
బుధవారం మునుగోడు మండలం క్రిష్టపురం గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్రంపై స్వారీ చేశారు. రోడ్ షోలో పాల్గొనగా... స్థానిక నేతలు, కార్యకర్తలు కోరిక మేరకు గుర్రంపై స్వారీ చేసి సందడి చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు.
జనసేన నేతలకు షాక్…
విశాఖలో మంత్రుల కార్లపై దాడికి దిగిన జనసేన నేతలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు తమకు బెయిల్ ఇవ్వాలంటూ అరెస్టయిన జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విశాఖ కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... నిందితులను పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బదిలీలు….
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వీర పాండ్యన్, మార్క్ ఫెడ్ జేఎండీగా కూడా ఆయనే అదనపు బాధ్యతలను చూడనున్నారు. ఏపీ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్గా రిటైర్డ్ సీఎస్ ఆదిత్యనాథ్కు అదనపు బాధ్యతలు అప్పగించింది,
సోముపై కన్నా ఫైర్….
బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరోవైపు ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. జనసేన - టీడీపీ మధ్య సయోధ కుదరటం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్... చర్చనీయాంశంగా మారయ్యాయి.
పవన్ తో సోమువీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని కన్నా విమర్శించారు. పవన్ తో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్నారు. సమస్య అంతా సోమువీర్రాజుతోనే అన్న ఆయన... ఒక్కడే అన్ని చూసుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదన్నారు - ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం ఆదేశాలు …
మహిళా, శిశు సంక్షేమశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్లు రూపకల్పన చేయాలని సూచించారు. అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు. నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని సూచించారు. పలు పోస్టుల భర్తీని దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు.సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్వన్గా నిలవాలన్నారు
టూర్ ప్యాకేజీ
IRCTC Tourism Rajasthan Tour Package 2022: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'GOLDEN SANDS OF RAJASTHAN' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఫ్లైటీ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. జైసల్మేర్, జోద్ పూర్, మౌంట్ అబు, ఉదయ్ పూర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. నవంబర్ 26వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ఫ్లైట జర్నీ ద్వారా టూర్ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
ఫీజులు ఖరారు
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
భేటీ…
ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు సీఎం కేసీఆర్. ఆ వెంటనే ప్రగతి భవన్ లో అధికారులతో భేటీ అయ్యారు. సీఎస్, డీజీపీ హాజరయ్యారు.
ఈసీ బ్రేక్….
మునుగోడులో గొర్రెల పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. నగదు జమపై ఫిర్యాదుతో స్కీమ్ ప్రస్తుతం ఆపివేయాలని ఈసీ ఆదేశించింది.
కమలం గూటికి నర్సయ్య గౌడ్….
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. బీజేపీలో చేరారు. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్, రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
హామీలు నెరవేరుస్తాం - రాహుల్ గాంధీ
Rahul Gandhi Bharat Jodo Yatra in AP: కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదోని మండలం చాగి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర... ఉదయం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాగింది. ఈ సందర్భంగా కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన… పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జోడో యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. దీనితో ఏపీలో కాంగ్రెస్ ను పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
రాహుల్ జోడో యాత్ర
ఏపీలో రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. కర్నూలు మీదుగా యాత్ర నడుస్తోంది. మంగళవారం కర్నూలు ప్రవేశించిన యాత్ర.. రెండో రోజు బుధవారం.. ఆదోని మండలం చాగి నుంచి మెుదలైంది.
మునుగోడు బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్!
మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథానికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజమైన బీజేపీ నేత కాదని వాయిస్ లో ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో మీకు తెలుసని వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలో మాకు సహకరించండని జగన్నాథంతో కేటీఆర్ మాట్లాడినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం వైరల్ అవుతున్న వీడియోలోని ఆడియో ఫేక్ అంటున్నాయి.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. జూటూరులో వైసీపీ నేతలపై కత్తులతో జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా.. జేసీ ప్రభాకర్రెడ్డితోపాటుగా 13 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బండిపై ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
మునుగోడులో ఎన్నికల కోడ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉల్లంఘించారని ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఓటు కోసం డబ్బులు తీసుకోవాలని అవినీతిని ప్రోత్సహించేలా బండి సంజయ్ మాట్లాడారని పేర్కొంది. ఎన్నికల అధికారిని కలిసిన టీఆర్ఎస్ నేతలు చర్యలు తీసుకోవాలని కోరారు.
రాహుల్ జోడో యాత్ర.. పీసీసీ కమిటీలు
తెలంగాణలో భారత్ జోడో యాత్ర పర్యవేక్షణ నిమిత్తం పీసీసీ 13 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నేతలకు భాగస్వామ్యం కల్పించింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్రంలోని ప్రజా సంఘాలను, మేధావులను, ఎన్జీవోలను రాహుల్ గాంధీతో సమన్వయం కోసం ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా కమిటీ వేశారు.
వివేకా హత్య కేసులో సునీతారెడ్డి చెప్పినవి నిజాలే
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పలు కీలక విషయాల్ని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. కేసులో నిందితులు దర్యాప్తు విచారణాధికారిపైనే తిరిగి కేసులు పెట్టారని పేర్కొన్నారు. అందుకే విచారణలో జాప్యం జరుగుతోందని తెలిపారు. హత్య జరిగిన తర్వాత నిందితులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరించారన్నారు. సునీతా రెడ్డి వాదనలు అన్నింటికీ సీబీఐ మద్దతు చెప్పింది. ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని తెలిపింది.