Vinayaka Nimajjanam : వినాయక నిమజ్జనం ఏ రోజు చేయాలి? ఎలా చేయాలి?
27 September 2023, 6:00 IST
- Vinayaka Visarjan 2023 : దేశవ్యాప్తంగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. మరోవైపు వినాయక నిమజ్జనం సమయం దగ్గరపడుతుంది. ఈ విషయం గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వినాయక నిమజ్జనం
Ganesh Immersion 2023 : వినాయక నిమజ్జనం కార్యక్రమము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించవలసినటువంటి విషయం. విఘ్నేశ్వరున్ని వినాయకచవితికి ఆయన్ని ఆరాధించడం మొదలు పెట్టినప్పటి నుండి విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేవరకు కొన్ని విధి విధాలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శాస్త్ర ప్రకారం ఆలోచించినట్లయితే విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమము ఏదైతే ఉందో విశేషంగా సముద్ర ప్రాంతాలలో కాని, నదులలో కాని, తటాకములయందు కావచ్చు మట్టితో చేసిన వినాయకున్ని మాత్రమే నిమజ్జనం చేయాలి.
లేటెస్ట్ ఫోటోలు
రంగులతో ఉన్న వినాయకుని గాని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక బొమ్మలను కాని పూజించడం, నిమజ్జనం చేయడం అంత సరైనది కాదు. అలా రంగులతో ఉన్నట్లయితే... అలాగే సముద్రం, నదులు, తటాకములు అందుబాటులో లేనటువంటివారు ఇంటిలో ఒక బిందెతో కాని, పాత్రతో కాని నీళ్ళు తీసుకుని ఆ నీటిలో వినాయకుని నిమజ్జనం చేయాలి.
వినాయకుని నిమజ్జనం 3వరోజు, 5వరోజు, 9వరోజు, 11వ రోజు, 21వరోజులలో చేసుకోవడం ఉత్తమం. ఇదే కాకుండా కొన్ని పరిస్థితులలో మిగతా రోజులలో నిమజ్జనం ఆచరించాలన్నా ఆ యొక్కస్థితులలో ఆచరించడం తప్పులేదు. కానీ పైన చెప్పిన విధంగా ఆచరించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయక నిమజ్జనం కొన్ని ప్రాంతాలలో కొన్ని పద్ధతులలో చేస్తారు. మంగళవారం, శుక్రవారం చేయకుండా ఉండటం మంచిదని, మిగతా వారాలలో చేయడం ఉత్తమమని ప్రాంతాల నియమాలను బట్టి ఆచరించుకోవచ్చు అని చిలకమర్తి తెలిపారు.
వినాయక చవితి రోజు వినాయకుని దీపారాధన చేసి ఎలా అయితే పూజిస్తామో, అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా వినాయకునికి అలాగే దీపారాధన చేసి పూజించాలి. నిమజ్జనం చేసే ముందు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించిన మంత్రాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేయాలని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ కార్యక్రమము చేసేటప్పుడు చెప్పులు ధరించకుండా నదీ ప్రాంతానికి వెళ్ళడం ముఖ్యం. ఎలాంటి పాటలు, డ్యాన్సులు, వెకిలి చేష్టలు చేయకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేయాలి.
వినాయకుని తీసుకువెళ్ళేటప్పుడు స్వయంగా ఆ భగవంతుడినే మనం తీసుకు వెళుతున్నట్లుగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనను నిమజ్జనం చేయాలి. నదీ ప్రాంత సమీపంలో ఉన్న మట్టిని ఇంటికి తీసుకుని వచ్చి వినాయకుని తయారుచేసి ఆయనకు ప్రాణ ప్రతిష్ట చేసి ఆయనను పూజించి ఆయన శక్తిని పొంది, ఆ పొందిన శక్తిని మనం పొంది యధార్థ స్థానం అంటే మరలా అదే నదీతీరంలో నిమజ్జనం చేయాలి. ఇందులో మూలార్థం ఏమిటంటే ఈ సృష్టి ఎక్కడ నుండి మొదలు అవుతుందో మరలా తిరిగి అక్కడకే వెళ్ళడం. ప్రతి దానికి ఆది అంతం అనేవి ఉంటాయి.
అలాగే మానవుడు కూడా జీవితం కూడా మట్టితోనే ముడిపడి ఉంటుంది. ఇదే వినాయక నిమజ్జనంలో ఉన్న సృష్టి అంతరార్థం. వినాయక నిమజ్జనం రోజు ఆటపాటలు, వెకిలిచేష్టలు చేయకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలి. అలాగే ఎలాంటి రంగు బొమ్మలను వాడకుండా, మట్టి బొమ్మలను మాత్రమే నదులలో, సముద్రాలలో కలపడం ఉ త్తమం. రంగులు వేసిన బొమ్మలను ఇంటిలో నీళ్ళ బిందెలలో కలపాలని ఆ నీటిని, మొక్కలకు, రావిచెట్టు వంటి వాటికి పోయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.