Deepavali 2023 : దీపావళి రోజున లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి?
11 November 2023, 10:30 IST
- Deepavali 2023 : దీపాల పండుగ దీపావళి వచ్చేసింది. ఈరోజున లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు కొన్ని పనులు చేయాలని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి చెప్పారు.
దీపావళి
సనాతన ధర్మంలో అనేక పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు అన్నింటిలో ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత, నిగూఢత దాగి ఉ౦టాయి. భారతీయ పండుగలు అన్నింటిలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భారతీయ సనాతన ధర్మాన్ని హైందవధర్మాన్ని ఆచరించేటటువంటివారు దేశ, కాలమాన పరిస్థితులను బట్టి ప్రాంతాలు, ఆచారాలను బట్టి కొన్ని పండుగలలో వ్యత్యాసాలు చూడవచ్చు. అయితే భారతీయ పండుగలు అన్నింటిలో ప్రాంతాలతో సంబంధం లేకుండా సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ పాటించే పండుగ దీపావళి అని చిలకమర్తి చెప్పారు.
లేటెస్ట్ ఫోటోలు
దీపావళి పండుగ అంటే శివకేశవుల సంబంధం రెండూ ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణుపత్ని గంగాధరుడు అని శివుడికి పేరు. అందుకని శివకేశవుల ఇద్దరి యొక్క విషయం వచ్చింది అందులోకి. ఆశ్వయుజ అమావాస్యనే ప్రేత అమావాస్య అంటారు. ప్రతి దీపావళికి ప్రదోషకాలానికి పితృదేవతలు వస్తారు. అందుకే దీపావళి సాయంకాలం అన్ని పూజలకన్నా ముందు పూజ దివిటీ కొట్టడం చేస్తారు. ఇది మగపిల్లలు చేయాలి. ఆడపిల్లలు చేయరాదు. వారు గోగుకర్ర జ్యోతి వేసి ఒత్తి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి.
ప్రతి అమావాస్యనాడు పితృదేవతలు మధ్యాహ్నము 12 గంటలకు ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు. దీపావళి అమావాస్యనాడు మాత్రము ప్రదోషవేళ వరకు ఉటారు. చీకట్లో వెళ్ళిపోతూ వారు ఇంత కష్టపడి సంతానమును కన్నాను. ఎన్నో సుఖములు ఇచ్చాను. వీడు నాకు మార్గము చూపిస్తాడా అని అనుకుంటారు. కొడుకు దక్షిణ దిక్కుతిరిగి దివిటీ చూపిస్తే ఆ కాంతులు పితృదేవతలకు కనబడతాయి. ఆ కాంతులలో వాళ్ళు పరమసంతోషముతో వెళ్ళిపోతారు. వంశాఖివృద్ధికి పితృదేవతల సంతోషమే కారణమని చిలకమర్తి తెలిపారు.
దీపావళినాడు తప్పకుండా మినప ఆకుకూర తినాలి. మినపాకు అంటే మినుములలు నానేసుకుంటే మొలకలొచ్చిన వాటినే కొద్దిగా కూరలాగ చేసుకుని తినవచ్చు. సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం చెబుతోంది. దీపదానం చేయటం కూడా చాలా మంచిది. ఇక్కడ్నుంచి కార్తీక మాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.
దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం ఆచారమైనది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు. ముఖ్యంగా అర్ధరాత్రి స్త్రీలు ఈ కార్యం నిర్వహించవలసి ఉంటుంది. దీపావళి ముందు రోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు ఈ మూడు రోజులు బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు ఈ రోజుల్లో లక్ష్మీపూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు. కాబట్టి ఈ మూడు రోజులు లక్ష్మీపూజకు ప్రసిద్ధమైనదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళు, కలసిరానివాళ్ళు, దుఃఖిస్తున్నవాళ్ళు దీపావళి పండుగనాడు చెయ్యవలసిన విధిని సక్రమంగా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో నుండి అలక్ష్మి వెళ్ళిపోతుంది. దరిద్రముతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం దీపావళి తిథి వచ్చిందని చిలకమర్తి తెలిపారు.