Menstruation: షాకింగ్ అధ్యయనం... ఆడపిల్లలు ఆ వయసులో రజస్వల అయితే మధుమేహం వచ్చే అవకాశం
09 December 2023, 16:00 IST
- ఆడపిల్లలు త్వరగా రజస్వల అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతోంది అధ్యయనం.
ఏ వయసులో రజస్వల అవ్వాలి?
ఆడపిల్లల్లో రజస్వల కావడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. సాధారణంగా పదేళ్ల నుంచి 16 ఏళ్ల లోపు రుతుక్రమం ప్రారంభం అవుతుంది. అయితే కొత్త అధ్యయనం ప్రకారం ఏ ఆడపిల్లల్లో 13 ఏళ్లు నిండకముందే రుతుక్రమం ప్రారంభం అవుతుందో... వారిలో పెద్దయ్యాక టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ న్యూట్రిషన్ ప్రివెన్షన్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఆడపిల్లలు త్వరగా రజస్వల కావడం భవిష్యత్తులో వారి ఆరోగ్యానికి మంచిది కాదు.
ఏ ఆడపిల్లలైతే 10 ఏళ్ల కంటే ముందే రజస్వల అవుతారో వారిలో 65 ఏళ్ల లోపు పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ వయసులోనే మధుమేహం కూడా రావచ్చు. పరిశోధకులు ఈ అధ్యయనంలో భాగంగా 17 వేల కంటే ఎక్కువ మంది మహిళల ఆరోగ్య డేటాను విశ్లేషించి ఫలితాన్ని తేల్చి చెప్పారు.
10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులో రజస్వలైన ఆడపిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 32 శాతం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. 11 సంవత్సరాలకు రజస్వలైన ఆడపిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14% అధికంగా ఉండగా, 12 ఏళ్లకు పిల్లల్లో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 9% ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం చెప్పింది.
రజస్వల అయితే స్ట్రోక్ కూడా...
మధుమేహం మాత్రమే కాదు తక్కువ వయసులో రుతుస్రావం మొదలైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. 11 సంవత్సరాల వయసులో మొదటి పీరియడ్స్ వస్తే వారికి భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదం 81 శాతం ఎక్కువ. అదే 12వ సంవత్సరంలో రజస్వల అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 32 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక 14 సంవత్సరాల వయసులో మొదటి పీరియడ్ వస్తే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువగా 15% మాత్రమే ఉంటుంది.
ఆధునిక కాలంలోనే అమ్మాయిలు చాలా తక్కువ వయసులో రజస్వల అవుతున్నారు. ఇలా ఎందుకు అవుతున్నారో తెలుసుకోవడం కోసం అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే బరువు పెరగడం, అతిగా మాంసాహారం తినడం, జన్యు పరమైన కారణాలతో పాటు తీవ్రమైన ఒత్తిడి వంటివి ఇలా రజస్వల త్వరగా రావడానికి కారణాలుగా భావిస్తున్నారు. అలాగే పిల్లలు తిన్న ఆహారంలో సోయాబీన్స్ అధికంగా ఉన్నా కూడా త్వరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛమైన ఆహారం ఇప్పుడు లభించడం లేదు. రసాయనాలు, పురుగుల మందులు కలిపిన ఆహారాలే లభిస్తున్నాయి. వాటిని తిన్న పిల్లల్లో త్వరగా బరువు పెరిగి యుక్త వయసుకు త్వరగా వస్తున్నారు.
రజస్వల కావడంలో హార్మోన్ల విడుదల చాలా ముఖ్యమైనది. మెదడులోని హైపోథాలమస్ గ్రంధుల నుంచి వచ్చే సంకేతాలే హార్మోన్లు విడుదల అయ్యేలా చేస్తాయి. అమ్మాయిలు వయసుకు వచ్చేసరికి హార్మోన్ల స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఫలితంగానే వారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ హార్మోన్ల వల్లే రజస్వల అవుతారు. ఆడపిల్లల వయసు పదేళ్లు దాటాక 16 ఏళ్ల లోపు ఎప్పుడైనా రజస్వల రావచ్చు. మెదడు ఆ సమయంలో ఎప్పుడైనా సంకేతాలు పంపించవచ్చు. అయితే ఆ వయసునే మెదడు ఎందుకు ఎంచుకుంది అనే విషయం మాత్రం ఇంతవరకు తేలలేదు.