Monsoon Risky Destinations। మాన్సూన్లో ఈ ప్రాంతాలకు వెళ్లకండి, మీ యాత్ర సురక్షితం కాకపోవచ్చు!
13 July 2023, 8:30 IST
- Monsoon Risky Destinations: మీరు మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ వర్షాకాలంలో మీరు నివారించాల్సిన కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Monsoon Risky Destinations
Monsoon Risky Destinations: మీరు భారతదేశంలో మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, మీరు వెళ్లేచోటు సురక్షితమైనదో, కాదో ముందుగానే నిర్ధారించుకోండి. ఎందుకంటే మన దేశంలో విహారయాత్ర చేసేందుకు ప్రసిద్ధమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ, అందులో కొన్ని ప్రాంతాలను ఈ వర్షాకాలంలో సందర్శించటం అంత సురక్షితం కాకపోవచ్చు.
ఈ సీజన్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతాలు నమోదవుతాయి. వరదల ముప్పు పొంచి ఉంటుంది, కొండ చరియలు విరిగిపడే ఆస్కారం ఉంటుంది. వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలించకపోవచ్చు, దీంతో మీరు విహారయాత్రకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీవితంలో అదొక మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు. కాబట్టి అటుగా వెళ్లకండి. వర్షాకాలంలో మీరు విహారయాత్ర చేయడం నివారించాల్సిన కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మాన్సూన్ సీజన్లో వాతావరణం అస్సలు అనుకూలంగా ఉండదు. భారీ వర్షాలు, వరదలతో భయానకంగా ఉంటుంది. కొండచరియలు విరిగిపడటం, వరదలు రావటం, క్లౌడ్ బరస్ట్ వంటి ఊహించని ఉపద్రవాల ముప్పు ఎక్కువ ఉంటుంది. ఈ రాష్ట్రంలో కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి కానీ, వర్షాకాలంలో యాత్రలు చేయడం ప్రమాదకరం.
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హిమాలయాలకు నిలయం. షిమ్లా, కులు, మనాలి వంటి రొమాంటిక్ పర్యాటక్ ప్రదేశాలకు ప్రసిద్ధి. కానీ, వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు విహారయాత్ర చేయడం మంచిది కాదు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, రోడ్లు మూసుకుపోవడం ఇక్కడ సర్వసాధారణం. అందువల్ల ఈ సీజన్లో అక్కడ ట్రెక్కింగ్ చేయడం, పలు ప్రదేశాలకు ప్రయాణించటం చాలా ప్రమాదకరం.
కోస్టల్ మహారాష్ట్ర
రుతుపవనాల సమయంలో ముంబై సహా మహారాష్ట్రలోని తీర ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో భీకరంగా ఉంటాయి. ముంబైలో నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి, కాబట్టి ఈ సమయంలో ఈ ప్రదేశాలకు టూర్ వెళ్తే ఇబ్బందులే.
కేరళలోని కొన్ని ప్రాంతాలు
దైవిక దేశంగా ప్రసిద్ధిగాంచిన కేరళలో పర్యాటక ప్రదేశాలకు కొదువే లేదు. అయితే ఈ రాష్ట్రంలోని అలెప్పి, మున్నార్, మొదలైన ప్రాంతాలను మాన్సూన్లో సందర్శించకపోవడమే మంచిదంటారు.ముఖ్యంగా బ్యాక్ వాటర్స్ లో విహారం, హౌస్బోట్ పర్యటనలు ఈ సీజన్లో అనువైనవి కాకపోవచ్చు. ఇక్కడ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం సంభవించవచ్చు.
చిరపుంజి
చిరపుంజి సంవత్సరం పొడవునా స్థిరంగా వర్షపాతం పొందే ప్రదేశం. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ అనూహ్యరీతిలో అతిభారీ వర్షపాతాలను నమోదుచేస్తుంది, ఎంతగా అంటే ఒక్కోసారి ఈ వర్షపాతం 11,777 మిమీ వరకు చేరుకుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 12°C నుండి 16°C మధ్య ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో చిరపుంజీని సందర్శించకుండా ఉండటం మంచిది.
ఒక్క చిరపుంజి మాత్రమే కాకుండా ఈశాన్య భారతదేశంలో ఉన్న అస్సాం, డార్జిలింగ్ మొదలైన ప్రాంతాలను సందర్శించకపోవటమే ఉత్తమం.