Periods: పీరియడ్స్ సమయంలో బొప్పాయి, పైనాపిల్ తినకూడదని అంటారు, అది నిజమేనా?
08 December 2023, 14:55 IST
- Periods: మహిళలకు పీరియడ్స్ వస్తే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచుతారు.
పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినవచ్చా?
Periods: ప్రతి మహిళ జీవితంలో పీరియడ్స్ రావడం సహజం. పీరియడ్స్ రాకపోతే ఆ మహిళలకు ఏదో అనారోగ్యం ఉందని అర్థం. నెలసరి విషయంలో నిర్లక్ష్యం తగదు. ఒక్క నెల పీరియడ్స్ రాకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మహిళల పునరుత్పత్తి వ్యవస్థకు ముఖ్యమైన ప్రక్రియ ఈ పీరియడ్స్. అందుకే ప్రతినెలా పీరియడ్స్ రావడం చాలా ముఖ్యం.
అనాదిగా మన సాంప్రదాయంలో పీరియడ్స్ సమయంలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఆ కట్టుబాట్లకు లోబడి ఇప్పటికీ మహిళలు ఎంతోమంది జీవిస్తున్నారు. పీరియడ్స్ వచ్చిన మహిళలను దూరంగా ఉంచడం, ఇంట్లోకి రానీయకపోవడం వంటివి ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అలాగే వారు తినే పదార్థాలపై కూడా కొన్ని నియమ నిబంధనలను ఉంచారు. పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినకూడదని, అలా తింటే రక్తస్రావం అధికంగా అవుతుందని అంటారు. అందులో ముఖ్యమైనవి బొప్పాయి, పైనాపిల్, నువ్వులు, గోంగూర వంటివి.
బొప్పాయి - పైనాపిల్ తినవచ్చా?
పైనాపిల్, నువ్వులు, గోంగూర, బొప్పాయి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. వీటిలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయినా కూడా వీటిని నెలసరి సమయంలో తినవద్దని చెబుతారు. ఇందులో ఏమాత్రం శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇంకా చెప్పాలంటే పీరియడ్స్ సమయంలో ఇవన్నీ తినడం చాలా ఆరోగ్యకరం. వీటిని తినడం వల్ల రక్తస్రావం అధికంగా అవుతున్నట్టు అనిపిస్తే... కాస్త మితంగా తినండి చాలు. అంతే తప్ప పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.
పీరియడ్స్ సమయంలో పొట్ట ఉబ్బరంగా అనిపించడం, మలబద్ధకం, పొట్ట నొప్పి వంటి సమస్యలు బాధ పెడుతూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం కలిగించే లక్షణం నువ్వులకు, బొప్పాయికి, పైనాపిల్ కు ఉంది. కాబట్టి నెలసరి రావడానికి వారం రోజులు ముందు నుంచే వీటిని తినడం ప్రారంభిస్తే ఎంతో మంచిది.
కొందరిలో నువ్వులు, బొప్పాయి, పైనాపిల్, గోంగూర వంటివి అధిక రక్తస్రావానికి కారణం అవుతూ ఉంటాయి. అవేమీ పెద్ద సమస్య కాదు. చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. మీకు సందేహం అనిపిస్తే ఆ మూడు రోజులు తినడం మానేస్తే సరిపోతుంది. అంతేకానీ నెలసరిని దృష్టిలో పెట్టుకొని నెలలో 15 రోజులు తినడం మానేసే వాళ్ళు ఉన్నారు. పీరియడ్స్ రావడానికి వారం రోజులు ముందు నుంచి, పీరియడ్స్ ముగిసిన వారం రోజులు తర్వాత కూడా భయంతో వీటిని దూరం పెడతారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. నెలసరి సమస్యలను పరిష్కరించడంలో నువ్వులు ముందుంటాయి. కాబట్టి వీటిని నెలసరి రావడానికి ముందు నుంచే తినడం ప్రారంభించాలి. నడుము నొప్పి, పొట్ట నొప్పి వంటివి రాకుండా ఇది కాపాడుతుంది.
నువ్వులు, బొప్పాయి, పైనాపిల్, గోంగూర వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి మన శరీరం వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. నెలసరి సమయంలోనే కాదు సాధారణ సమయంలో కూడా ప్రతి వారం వీటిని తినాల్సిన అవసరం ఉంది.