Shabbir Ali: నిజామాబాద్లో ఓటమి పాలైన షబ్బీర్ అలీ.. చీలిన మైనార్టీ ఓట్లు
04 December 2023, 6:36 IST
- Shabbir Ali: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చక్రం తిప్పాలని ఆశపడ్డ మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. కామారెడ్డి నుంచి నిజామాబాద్కు మారిన ఫలితంలో మార్పురాలేదు.
ఓటమి పాలైన షబ్బీర్ అలీ
Shabbir Ali: షబ్బీర్ అలీ 2018లో కామారెడ్డిలో 3 వేల ఓట్లు పైచిలుకుతో ఓడిపోయారు. ఈసారి నిజామాబాద్ లో ఏకంగా 14 వేల ఓట్ల పైచిలుకుతో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పైచేయి సాధించినా... అర్బన్లో మాత్రం షబ్బీర్ అలీకి ఓటమి ఎదురయ్యింది.
కామారెడ్డిలో హేమాహేమీలు బరిలో నిలిచినా బెదరక పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థికి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. దీంతో అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్టుగా మారింది షబ్బీర్ అలీ పరిస్థితి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతామని కేసీఆర్ ప్రకటించిన మరుక్షణం...రేవంత్ రెడ్డి అక్కడ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీకి దిగాల్సి వచ్చింది. నిజామాబాద్ నుంచి అప్పటికే మున్నురుకాపు సామాజిక వర్గం నుంచి డి శ్రీనివాస్ తనయుడు డి సంజయ్ పోటీ చేయాలని సర్వం సిద్ధం చేసుకున్నాడు.
ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించినప్పటికీ... కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయడంలో కాలం గడిపింది. తీరా ఎన్నికలు సమీపించిన 20 రోజుల ముందు కామారెడ్డికి చెందిన షబ్బీర్ అలీని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి వరకు నిజామాబాద్ అర్బన్లో సమస్యలపై, ఇక్కడి అధికార పార్టీ వైఫల్యాలపై ఏ మాత్రం అవగాహనలేని అభ్యర్థిని బరిలో దించి కాంగ్రెస్ పార్టీ పెద్దతప్పు చేసింది. దానికి ఫలితం అనుభవించింది.
మైనార్టీ ఓట్లతో గట్టెక్కుదామని...
నిజామాబాద్ అర్బన్లో 2,86,766 మంది ఓటర్లున్నారు. ఇందులో సుమారు 42 శాతం మైనార్టీ ఓటర్లున్నారు. దీంతో అర్బన్లో పోటీ చేస్తే మైనార్టీ ఓట్లతో సునాయసంగా విజయం సాధించవచ్చని షబ్బీర్ అలీ వేసుకున్న లెక్కలు తప్పాయి. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థితో పాటు అధికార బీఆర్ఎస్కు కూడా పడ్డాయి. సాధారణంగా ప్రతిసారీ మెజార్టీ ఓట్లు చీలి అధికార పార్టీకి కలిసి వచ్చేది. కానీ ఈసారి మైనార్టీ ఓట్లు చీలి చివరకు బీజేపీ అభ్యర్థికి కలిసి వచ్చింది.
(మీసా భాస్కర్, నిజామాబాద్)