GST collections: ఏపీ కంటే తెలంగాణలో రూ. 700 కోట్లు జీఎస్టీ అదనపు రాబడి
01 November 2022, 12:56 IST
- GST collections in October: అక్టోబరులో జీఎస్టీ భారీగా వసూలైంది. ఏప్రిల్ తరువాత రెండోసారి రూ. 1.5 లక్షల కోట్ల మార్కును ఈ వసూళ్లు అధిగమించాయి.
అక్డోబరులో దేశవ్యాప్తంగా 18 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
GST collections in October: అక్టోబరు 2022 మాసంలో జీఎస్టీ రూ. 1,51,718 కోట్ల మేర వసూలైంది. మొన్న ఏప్రిల్ తరువాత రూ. 1.50 లక్షల కోట్ల మార్కు అధిగమించడం ఇది రెండోసారి.
సెంట్రల్ జీఎస్టీ రూ. 26,039 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 33,396 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 81,778 కోట్లు వసూలైంది. సెస్ రూపంలో మరో రూ. 10,505 కోట్లు వసూలైంది.
దేశీయ లావాదేవీలపై వసూలైన జీఎస్టీ కూడా ఏప్రిల్ తరువాత అక్టోబరులో రెండో అత్యధిక వసూలు. ఇక జీఎస్టీ నెలవారీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా ఎనిమిదోసారి.
ఆగస్టు మాసంలో 7.7 కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్ అవ్వగా సెప్టెంబరు మాసంలో 8.3 కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇక దేశంలో మాన్యుఫాక్ఛరింగ్ యాక్టివిటీస్ కూడా పటిష్టంగా కొనసాగుతున్నాయని మంగళవారం ఓ ప్రయివేటు సర్వే వెల్లడించింది.
‘తయారీ రంగ పీఎంఐ డేటా విషయంలో భారత్ క్రమంగా పుంజుకుంటోంది. ఉత్పత్తి, ఉపాధి సృష్టి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది..’ అని బార్క్లేస్ ఎండీ రాహుల్ బజోరియా తెలిపారు.
‘తయారీ రంగానికి పండగ సీజన్ కలిసొచ్చింది. అయితే విచక్షణతో కొనుగోలు చేసే కన్జ్యూమర్ డ్యురేబుల్స్కు డిమాండ్ పెరగాల్సిన అవసరం ఉంది. పెరిగిన వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్భణం, ఆర్థిక మందగమన పరిస్థితులు తయారీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. అయితే పండగ సీజన్ కొనుగోళ్లను బట్టి చూస్తే దేశీయ డిమాండ్ పుంజుకుంటోందని అర్థమవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నప్పటికీ దేశంలో ఆర్థిక వృద్ధి పటిష్టంగానే ఉంది. రానున్న రెండేళ్లలో 6 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది..’ అని విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల..
తెలుగు రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు 24 శాతం మేర పెరిగి రూ. 3,579 కోట్లకు చేరుకున్నాయి.
తెలంగాణలో గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ. 4,284 కోట్లకు చేరుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో దాదాపు రూ. 700 కోట్లు అధికంగా వసూలయ్యాయి.