Bhadrachalam Godavari Floods : భయాందోళనలో ఈ 17 గ్రామాల ప్రజలు-these 17 villages people on alert beacuse of godavari floods ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  These 17 Villages People On Alert Beacuse Of Godavari Floods

Bhadrachalam Godavari Floods : భయాందోళనలో ఈ 17 గ్రామాల ప్రజలు

Anand Sai HT Telugu
Sep 15, 2022 05:56 AM IST

Godavari Floods 2022 : భద్రాచలంలోని ఐదు మండలాలు, కాలనీల్లోని 17 గ్రామాల ప్రజలు గోదావరి వరదలతో భయాందోళనలో ఉన్నారు. బుధవారం సాయంత్రానికి భద్రాచలంలో నదీమట్టం 49.02 అడుగులకు చేరుకోగా, మంగళవారం నుంచి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

గోదావరి వరద(ఫైల్ ఫొటో)
గోదావరి వరద(ఫైల్ ఫొటో)

గోదావరి వరద రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గతంలో చూసిన పరిస్థితులు గుర్తుకుతెచ్చుకుంటూ... బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. వరదనీరు అనేక చోట్ల రోడ్లపైకి చేరడంతో భద్రాచలం నుంచి వెంకటాపురం, మొండికుంట, బూర్గంపహాడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి గోదావరిలోకి వరద నీరు భారీగా చేరడంతో అధికారులు నిఘా పెట్టారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. భద్రాచలంలోని సుభాష్‌నగర్‌, కోతకాలనీ, అయ్యప్పనగర్‌, దుమ్ముగూడెంలో ఐదు గ్రామాలు, చర్ల మండలంలో రెండు గ్రామాలు, బూర్గంపహాడ్‌ మండలంలో నాలుగు గ్రామాలు, అశ్వాపురంలో రెండు, మణుగూరు మండలాల్లోని రెండు గ్రామాలు వరదలను చూసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. నీటి మట్టం మరింత పెరిగింది.

విలీన మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇతర ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ నిలిపేశారు. విలీన మండలం కూనవరం వద్ద మూడో ప్రమాద స్థాయిని మించి నీరు ప్రవహిస్తోంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 150కి పైగా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. రెండు నెలల్లో గోదావరి ఉప్పొంగడం ఇది నాలుగోసారి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు కోరారు. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌లు 1070 మరియు 18004250101 లేదా 08632377118కు కాల్ చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఎప్పుడైనా సంప్రదించాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎండీ అంబేద్కర్ బాధితులకు సూచించారు.

తమ గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్న కారణంగా చాలా మంది బాధితులు తమ నివాసాలకు సమీపంలోని కొండ ప్రాంతాలకు చేరుకున్నారు. విలీన మండలాల్లోని పోలవరం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల వాసులు వరదలతో నిత్యం ఇబ్బందులు పడుతుండటంతో విసిగిపోయి ఆందోళనలకు దిగారు.

మరోవైపు కల్లెరు, కోయుగూరు వద్ద ఎన్‌హెచ్‌-30లోకి వరదనీరు చేరింది. ఫలితంగా ఒడిశా-తెలంగాణ మధ్య రోడ్డు మార్గం తెగిపోయింది. కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, కుకునూరు నుంచి భద్రాచలం వెళ్లే రహదారులన్నీ ఒక్కో చోట వరద నీరు చేరి రోడ్డు సౌకర్యం లేకుండా అయిపోయింది. కూనవరం మండలం పండ రాజుపేట వద్ద వరదనీరు రోడ్లపైకి చేరింది. దాచారం-కుకునూరు వంతెన నీట మునిగి ఎనిమిది గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో ఈ గ్రామాల నుంచి భద్రాచలం వెళ్లే వారు 15కిలోమీటర్లు అదనంగా వెళ్లాల్సి వస్తోంది.

కుకునూరు మండలంలో మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. ముంపునకు గురయ్యే వడ్డిగూడెం, వడ్డిగూడెం కాలనీ, ధర్మతాళ్లగూడెం, రాజుపేట, రాజుపేట కాలనీ, శ్రీరామగిరి, బొక్కనవపల్లి తదితర గ్రామాల వాసులు వీఆర్‌పురం మండలంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కూనవరం మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అదికారులు చెబుతున్నారు. బుధవారం వరకు వరద తగ్గే అవకాశం ఉందంటున్నారు.

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , పశ్చిమగోదావరి జిల్లాలకు సరిహద్దుగా ఉన్న కనకాయలంక కాజ్‌వే జలమయం కావడంతో కాజ్‌వేపై రోడ్డు కనెక్టివిటీ పోయింది. కోనసీమ జిల్లాలోని అరిగెలవారిపేట, గంటి పెదపూడి లంక, ఊడిముడి లంక, జి పెదపూడి లంక, పశ్చిమగోదావరి జిల్లా కానాయలంక అనే ఐదు ద్వీప గ్రామాలు ముంపునకు గురయ్యాయి. స్థానికులు మంగళవారం కిరాణా, పాలు తదితరాలు తెచ్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలను వినియోగించారు.

కాఫర్‌డ్యామ్‌ నిర్మాణంతో తమ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని విలీన మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని పూర్తి చేయాలని, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం