September 12 Telugu news Updates : అధికార లాంఛనాలతో కృష్ణంరాజుకు అంతిమవీడ్కోలు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెటెస్ట్ అప్ డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడూ రిఫ్రెష్ చేయండి.
Mon, 12 Sep 202205:13 PM IST
పబ్ల నిర్వహణ అంశంపై విచారణ
భాగ్యనగరంలో పబ్ల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ చేసింది. సౌండ్ నిబంధన ఉల్లంఘించిన పబ్లపై నమోదైన కేసుల గురించి అడిగింది. ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. నివేదిక సమర్పించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నగర పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. పబ్ లైసెన్స్ మంజూరుకు పరిగణించిన అంశాలేంటో చెప్పాలని జీహెచ్ఎంసీకి ఆదేశించింది.
Mon, 12 Sep 202205:12 PM IST
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. గోదావరిలో వరద దృష్ట్యా అధికారులను అప్రమత్తమయ్యారు.
Mon, 12 Sep 202202:43 PM IST
అదుపుతప్పి మినీ బస్సు బోల్తా
తిరుమల దర్శనానికి వెళ్లి వస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ బాలాజీ డైరీ సమీపంలో ఘటన జరిగింది. హైదరాబాద్ లోని రామంతపూర్,అంబర్ పేట,రామనగర్ కు చెందిన నాలుగు కుటుంబాల సభ్యులుగా తెలుస్తోంది. శ్రీవారి దర్శనం అనంతరం కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని తిరుపతికి వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం సంభవించింది.
Mon, 12 Sep 202212:46 PM IST
ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. రెండు మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత, పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు తెలిపారు.
Mon, 12 Sep 202210:40 AM IST
అధికార లాంఛనాలతో కృష్ణంరాజుకు అంతిమవీడ్కోలు
రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు మొయినాబాద్ మండలం కనకమామిడిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణంరాజు భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు.
Mon, 12 Sep 202208:43 AM IST
శాసనసభ రేపటికి వాయిదా
రాష్ట్రానికి అన్యాయం చేస్తే కేంద్రాన్ని నిలదీద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. సంస్కరణల పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సభను మరో 2 రోజులు జరపాలని కోరుతున్నామని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా తీర్మానం చేయాలన్నారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.
Mon, 12 Sep 202206:57 AM IST
విద్యుత్ రంగాన్ని దోచుకునే కుట్ర
డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కోలను నిర్వీర్యం చేసే కుట్ర కేంద్రం చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో లక్షల కోట్ల రుపాయల విలువైన విద్యుత్ రంగ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టడానికి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. నెహ్రూ, కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికత వల్ల మహారత్న, నవరత్న కంపెనీల స్థాయికి విద్యుత్ రంగం ఎదిగిందన్నారు. ఆర్ఇసి వద్ద 13-14లక్షల కోట్ల విలువైనఆస్తులపై కన్నేసి దోచుకోడానికి ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు
Mon, 12 Sep 202206:01 AM IST
విద్యుత్ చట్టాలపై టీ కాంగ్రెస్ ఆగ్రహం
ఎన్నో కష్టాలు, త్యాగాలతో నిర్మితమైన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని బీజేపీ అమ్మేస్తోందని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ ప్రజల భవిష్యత్తును ఒకరిద్దరు పెట్టుబడి దారుల చేతుల్లో పెడుతుంటే చూస్తూ ఊరుకోకూడదన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్ నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించారని, వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగే సమయానికి రాష్ట్ర విభజన జరిగిందన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీల్లో పావు వంతు కూడా ప్రజలకు బీజేపీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
Mon, 12 Sep 202205:22 AM IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో కేంద్ర విద్యుత్ చట్టం పర్యావసానాలపై స్వల్ప కాలిక చర్చను ప్రారంభించారు. శాసనసభలో 7 బిల్లులలను అయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. శాసనసభలో కేంద్ర విద్యుత్ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరుపుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను పార్టీలకు అతీతంగా వ్యతిరేకత వ్యక్తమైంది.
Mon, 12 Sep 202205:14 AM IST
దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురువనున్నాయి. తీరం వెంట 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Mon, 12 Sep 202205:12 AM IST
గోదావరి, శబరి నదుల ఉధృతి
అల్లూరి జిల్లా కూనవరం దగ్గర గోదావరి శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం దగ్గర 35.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం చేరింది. చింతూరు దగ్గర 32 అడుగులకు చేరిన శబరి నీటిమట్టం పెరిగింది. విలీన మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి చేరిన వరద నీరు చేరింది. వీఆర్పురం మండలం చింతరేవుపల్లి దగ్గర రహదారిపైకి వరద నీరు చేరింది. విలీన మండలాల్లో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Mon, 12 Sep 202205:10 AM IST
సాయంత్రం రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు
పండితుల సూచన మేరకు నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి మార్పు చేశారు. మొయినాబాద్ కనకమామిడి ఫామ్హౌజ్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. చివరి చూపు కోసం అభిమానులు తరలివస్తున్నారు. అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు మాత్రమే అనుమతించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
Mon, 12 Sep 202204:04 AM IST
ఏపీలో విస్తారంగా వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండడంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మద్దువలసలో అత్యధికంగా 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏలూరు జిల్లా టి.నరసాపురంలో అత్యధికంగా 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది
Mon, 12 Sep 202204:04 AM IST
కృష్ణం రాజు మృతికి గవర్నర్ సంతాపం
మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు కృష్ణం రాజు ఆకస్మిక మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు.
Mon, 12 Sep 202204:04 AM IST
అమరావతే రాజధానిగా ఉంటుందన్న సుజనాచౌదరి
అమరావతి పై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేత సుజనాచౌదరి పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఎవరికి వారు రాజధానిపై రోజుకోమాట చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉంటుందన్నారు. 3 రాజధానులను నిర్మించడం వైసీపీ వల్ల కాదన్నారు. తమ హక్కు కోసం రైతులు చేపడుతున్న పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు
Mon, 12 Sep 202204:04 AM IST
గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -గణేష్ నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర దాడిలో ప్రత్తిపాడు ఎస్సై ప్రతాప్కుమార్కు గాయాలు అయ్యాయి. దీంతో ప్రత్తిపాడులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mon, 12 Sep 202204:04 AM IST
వైసీపీ నాయకుడి ఎర్రచందనం స్మగ్లింగ్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లె వైసీపీ నేత నాగభూషణంను ఎర్రచందనం రవాణాలో అరెస్ట్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో నాగభూషణంతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. కడప జిల్లా ఎల్లాపుల్లల బావికొండ దగ్గర 49 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు.
Mon, 12 Sep 202204:04 AM IST
అమరావతి మునిసిపాలిటీపై గ్రామసభలు
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై నేటి నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో తొలి గ్రామసభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో గ్రామసభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు హరిశ్చంద్రపురంలో గ్రామసభ నిర్వహిస్తారు. మున్సిపాలిటీ ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాజధానిలో 22 గ్రామాలతో కొత్త మునిసిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Mon, 12 Sep 202204:04 AM IST
అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభం
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమైంది. వెంకటపాలెం శివారు టీటీడీ ఆలయంలో పూజలు నిర్వహించిన రైతులు, టీటీడీ ఆలయం నుంచి వెంకటపాలెం వైపు పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం ఏర్పాటు చేవారు. పాదయాత్రలో రైతుల వెంట మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నడుస్తున్నారు.
Mon, 12 Sep 202204:04 AM IST
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
మేడ్చల్లో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అదుపుతప్పిన బైక్ లారీ కిందకు దూసుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి లారీ కిందకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.