Revanth Reddy Padayatra : పాదయాత్రకు రేవంత్ రెడ్డి రెడీ.. యాత్ర పేరేంటో తెలుసా?
TPCC Revanth Reddy Padayatra : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవున్నారు. జనవరి చివరి వారంలో యాత్ర మెుదలు పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.
తెలంగాణలో పాదయాత్ర(Padayatra)ల సీజన్ నడుస్తోంది. నేతలంతా జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. పాదయాత్రల పేరిట ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పటికే బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరిలో ఈ యాత్ర ఉండనుంది. 'సకల జనుల సంఘర్షణ యాత్ర' పేరుతో రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది.
ట్రెండింగ్ వార్తలు
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు వెళ్లేలా కాంగ్రెస్ నేతలు(Congress Leaders) పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపి.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు చేస్తున్నారు. జనవరి నుంచి మెుదలై.. 5 నెలల పాటు యాత్ర ఉండేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో సన్నాహక సమావేశం జరగనుంది. పాదయాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. ఎన్నికలు వచ్చేసరికి పార్టీని బలోపేతం చేసేలా.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజల్లో ఉంటూ.. స్థానిక అంశాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్రతో జనాల్లోకి వెళ్లడమే మార్గం అని తెలంగాణ కాంగ్రెస్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కునుగోలు ఉన్నారు. సునీల్ సూచనలు, సలహాల మేరకు కాంగ్రెస్ పార్టీ(Congress Party) నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో మెుదలైన అంతర్గత చిచ్చును తగ్గించేందుకు సిద్ధమవుతున్నారు.
హాత్ సే హాత్ జోడో యాత్ర సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ(TPCC) కొత్త కముటీ సభ్యులు రానున్నారు. ఏఐసీసీ(AICC) చేపట్టే కార్యక్రమాలపై చర్చిస్తారు. అయితే ఈ భేటీకి అసంతృప్తిగా ఉన్న సీనియర్లు వస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. సీనియర్లు మాత్రం.. ఈ సమావేశాన్ని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గాంధీ భవన్ దగ్గర ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.