Corona Booster Dose : 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్-corona free booster dose to 18 years above in telangana from 15th july ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Corona Booster Dose : 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్

Corona Booster Dose : 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్

HT Telugu Desk HT Telugu
Jul 14, 2022 09:36 PM IST

తెలంగాణలో జులై 15 నుంచి కొవిడ్​ బూస్టర్​ డోస్ అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ దవాఖానాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

18 ఏళ్లుపైబడిన అర్హులకు జులై 15 నుంచి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే బూస్టర్ డోస్​కి సంబంధించి అనుమతి ఇవ్వాలని కేంద్రానికి మంత్రి హరీశ్​ రావు లేఖలు రాశారు. దీనిపై కేంద్రం స్పందించిందని.. 18 ఏళ్లుపై బడి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

కేంద్రం నుంచి అనుమతి రావడంతో రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ద‌వాఖానాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. దీనికోసం రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా మంత్రి హరీశ్ రావు చెప్పారు. 75 రోజుల పాటు ఈ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ జరగనుంది. అర్హులైన వారంద‌రికి బూస్టర్ డోస్ ఇచ్చేలా ఆరోగ్య శాఖ ప్రణాళికలు వేసింది. క‌రోనా నుంచి కాపాడుకునేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం గతంలో అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు మాత్రమే అనుమతిచ్చారు. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేక‌పోవ‌డం కారణంగా చాలా మంది తీసుకోలేకపోయారు.

రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి మొత్తం 20 లక్షల డోసుల నిల్వ ఉన్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అర్హులైన వారికి బూస్టర్ డోస్ అందించేలా ఏర్పాట్లు చేయలని వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఈ మేరకు ఆదేశించారు. శుక్రవారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్టాండ్​లలో 24 గంటల పాటు బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచుతామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హౌసింగ్ సొసైటీలు, ఆఫీసులు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇతర పని ప్రదేశాల్లో.. వాళ్ల కోరిక మేరకు.. టీకా అందుబాటులో ఉంచుతామన్నారు.

IPL_Entry_Point