Women's IPL Format: మహిళల ఐపీఎల్‌.. ఐదు టీమ్స్‌.. 2 వేదికలు.. 20 లీగ్‌ మ్యాచ్‌లు-womens ipl may have five teams and 20 league matches ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Womens Ipl May Have Five Teams And 20 League Matches

Women's IPL Format: మహిళల ఐపీఎల్‌.. ఐదు టీమ్స్‌.. 2 వేదికలు.. 20 లీగ్‌ మ్యాచ్‌లు

వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్
వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్ (Twitter)

Women's IPL Format: మహిళల ఐపీఎల్‌ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. అయితే ఇందులో ఐదు టీమ్స్‌, రెండు వేదికల్లో 20 లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

Women's IPL Format: మహిళల క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ రానున్న సంగతి తెలుసు కదా. వచ్చే ఏడాదే దీనిని ప్రారంభించనున్నట్లు గతంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. అయితే ఈ లీగ్‌లో ఎన్ని టీమ్స్‌ ఉంటాయి, ఎన్ని మ్యాచ్‌లు, ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? టీమ్‌లో విదేశీ ప్లేయర్స్‌ సంఖ్యలాంటి అంశాలపై ఇప్పుడు బీసీసీఐ దృష్టి సారించింది.

ట్రెండింగ్ వార్తలు

తొలిసారి నిర్వహించబోతున్న ఈ లీగ్‌ను మొదట ఐదు టీమ్స్‌తో ప్రారంభించాలని బోర్డు భావిస్తున్నట్లు క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఇక ఒక్కో టీమ్‌లో తుది జట్టులో ఐదుగురు విదేశీ ప్లేయర్స్‌ను అనుమతించాలన్న ఆలోచనలో బోర్డు ఉంది. మెన్స్‌ ఐపీఎల్‌లో నలుగురు ప్లేయర్స్‌కే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. వుమెన్స్‌ ఐపీఎల్‌లో నలుగురు ప్లేయర్స్‌ ఐసీసీలో ఫుల్‌టైమ్‌ మెంబర్‌ టీమ్స్‌ నుంచి ఉండాలని, ఒకరు అసోసియేట్‌ టీమ్‌ నుంచి ఉంటే సరిపోతుందన్న నిబంధన విధించనున్నారు.

ఇక ఈ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే అవకాశం ఉంది. మొదట్లోనే వుమెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీ తర్వాత, మెన్స్‌ ఐపీఎల్‌కు ముందు వుమెన్స్‌ ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక టీమ్స్‌ ఎలా ఉండాలన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మెన్స్‌ ఐపీఎల్‌లో ఉన్నట్లుగా నగరాలకు అంటే అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కోల్‌కతాలకు ఇవ్వాలా లేక జోన్‌ వారీగా అంటే నార్త్‌ (ధర్మశాల/జమ్ము), సౌత్ (కొచ్చి/వైజాగ్‌), సెంట్రల్‌ (ఇండోర్‌/నాగ్‌పూర్‌/రాయ్‌పూర్‌), ఈస్ట్‌ (రాంచీ/కటక్‌), నార్త్‌ఈస్ట్‌ (గువాహటి), వెస్ట్‌ (పుణె/రాజ్‌కోట్‌)లకు ఇవ్వాలన్నదానిపై చర్చించనున్నారు.

మొదటి పద్ధతిలో మ్యాచ్‌లు ఐపీఎల్‌ వేదికల్లోనే జరుగుతాయి. ఒకవేళ జోన్‌ వారీగా టీమ్స్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఐపీఎల్‌ వేదికలు కాని వాటిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. దీనిపై తుది నిర్ణయం ఐపీఎల్‌ ఛైర్‌పర్సన్‌, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు తీసుకుంటారు. ఇక లీగ్‌ స్టేజ్‌లో ఒక్కో టీమ్‌ మరో టీమ్‌తో రెండేసిసార్లు ఆడతాయి. టేబుల్‌ టాపర్ నేరుగా ఫైనల్‌ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్‌ ఎలిమినేటర్‌లో తలపడతాయి.

ఈ వుమెన్స్‌ ఐపీఎల్‌ను రెండు వేదికల్లోనే జరిపే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కబడ్డీ లీగ్‌లో జరుగుతున్నట్లు ఓ లెగ్‌ మ్యాచ్‌లన్నీ ఒక వేదికలో జరిగిన తర్వాత మరో లెగ్‌ కోసం ఇంకో నగరానికి టీమ్స్‌ అన్నీ వెళ్తాయి. ఆ లెక్కన 2023 ఐపీఎల్‌ రెండు వేదికల్లో, 2024 ఐపీఎల్‌ మరో రెండు వేదికల్లో, ఇక 2025 ఐపీఎల్‌ మిగిలిపోయిన ఒక్క వేదిక, 2023లో ఆడిన మరో వేదికలో ఆడే అవకాశం ఉంది.

WhatsApp channel