Team India Sky Blue Jersey: టీ20 వరల్డ్‌కప్‌ కోసం మళ్లీ స్కైబ్లూ జెర్సీలో టీమిండియా-team india sky blue jersey for t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Sky Blue Jersey: టీ20 వరల్డ్‌కప్‌ కోసం మళ్లీ స్కైబ్లూ జెర్సీలో టీమిండియా

Team India Sky Blue Jersey: టీ20 వరల్డ్‌కప్‌ కోసం మళ్లీ స్కైబ్లూ జెర్సీలో టీమిండియా

Hari Prasad S HT Telugu

Team India Sky Blue Jersey: టీ20 వరల్డ్‌కప్‌ కోసం మళ్లీ స్కైబ్లూ జెర్సీలో కనిపించనుంది టీమిండియా. ఈ మెగా టోర్నీ కోసం ఇండియన్‌ టీమ్‌ కొత్త జెర్సీలను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ

Team India Sky Blue Jersey: వైట్‌బాల్ క్రికెట్‌లో ఇండియన్‌ టీమ్‌ అనగానే ఒకప్పుడు స్కై బ్లూ కలర్‌ జెర్సీయే గుర్తుకు వచ్చేది. అయితే కొంతకాలంగా మన టీమ్‌ డార్క్‌ బ్లూ జెర్సీల్లో కనిపిస్తోంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమ్‌ కిట్ స్పాన్సర్‌ అయిన ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ప్రస్తుతం టీమ్‌ వేసుకుంటున్న జెర్సీలను ఆవిష్కరించింది.

ఈ జెర్సీలు డార్క్‌ బ్లూ కలర్‌లో ఉండటంతోపాటు కొన్ని స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ వస్తున్న సమయంలో మరోసారి ఇండియన్‌ టీమ్‌ జెర్సీ మారనుంది. త్వరలోనే కొత్త జెర్సీలు లాంచ్‌ చేయబోతున్నట్లు మంగళవారం (సెప్టెంబర్‌ 13) ఎంపీఎల్ స్పోర్ట్స్‌ అనౌన్స్ చేసింది. ఓ వీడియో ద్వారా ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ఈ అనౌన్స్‌మెంట్ చేయగా.. దానిని బీసీసీఐ కూడా ట్వీట్‌ చేసింది.

ఈ వీడియోలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. వీళ్లు పైన జాకెట్‌ ధరించగా.. లోపల స్కైబ్లూ కలర్‌లో ఉన్న జెర్సీ కనిపించింది. దీంతో టీమిండియా మరోసారి ఈ కలర్‌ జెర్సీలు వేసుకోబోతున్నట్లు ఫ్యాన్స్‌ ఫిక్సయ్యారు. ఈ వీడియో వచ్చినప్పటి నుంచీ ట్విటర్‌లో ఫ్యాన్స్‌ తమ ఎక్సైట్‌మెంట్‌ను చూపిస్తున్నారు.

అయితే ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ మాత్రం ఈ కొత్త జెర్సీలు ఎప్పుడు లాంచ్‌ చేసేది, వీటి డిజైన్‌ ఎలా ఉండబోతోంది అన్న విషయాలను వెల్లడించలేదు. వచ్చే నెల 16 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఈ మెగా టోర్నీకి మరోసారి ఇండియన్‌ టీమ్‌ స్కై బ్లూ కలర్‌లో కనిపిస్తే చూడాలిన ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.

ఈ వరల్డ్‌కప్‌ కోసం సోమవారమే టీమిండియాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ టీమ్‌లోకి బుమ్రా, హర్షల్‌ పటేల్‌ తిరిగి రాగా.. షమి స్టాండ్‌బైగా ఉన్నాడు. సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది. గతేడాది కనీసం గ్రూప్‌ స్టేజ్‌ కూడా దాటని ఇండియన్‌ టీమ్‌పై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆసియా కప్‌లో ఫైనల్‌ చేరకుండా ఇంటిదారి పట్టిన ఇండియన్‌ టీమ్‌.. వరల్డ్‌కప్‌లోపు తిరిగి ఎలా గాడిలో పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.