Yash Dayal: రింకు కొట్టిన ఆ ఐదు సిక్స్లు చూసి ఏడుస్తూనే ఉన్న యశ్ దయాల్ తల్లి
Yash Dayal: రింకు కొట్టిన ఆ ఐదు సిక్స్లు చూసి యశ్ దయాల్ తల్లి ఏడుస్తూనే ఉందట. ఈ విషయాన్ని అతడి తండ్రి వెల్లడించాడు. గుజరాత్ తో మ్యాచ్ లో కేకేఆర్ చివరి ఓవర్లో ఊహించని విజయం సాధించిన విషయం తెలిసిందే.
Yash Dayal: ఐపీఎల్లోనే కాదు అసలు క్రికెట్ లోనే అత్యంత అరుదుగా కనిపించే ఘటన మొన్న గుజరాత్ టైటన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో జరిగిన విషయం తెలుసు కదా. ఆ మ్యాచ్ లో చివరి ఐదు బంతులను సిక్స్ లుగా మలచి కేకేఆర్ కు రింకు సింగ్ అనూహ్యమైన విజయం అందించాడు. ఆ సిక్స్ లతో రింకు ఒక్కసారిగా హీరో అయిపోగా.. యశ్ పరిస్థితి దారుణంగా తయారైంది.
అయితే ఈ ఐదు సిక్స్ ల తర్వాత యశ్ కంటే అతని తల్లి మరింత కుమిలిపోయినట్లు అతని తండ్రి వెల్లడించాడు. అది చూసిన తర్వాత ఆమె ఏడుస్తూనే ఉందని, తినడం కూడా మానేసిందని యశ్ తండ్రి చంద్రపాల్.. పీటీఐతో చెప్పారు. అయితే ఒకప్పుడు తాను కూడా నార్త్ జోన్ తరఫున క్రికెట్ ఆడిన చంద్రపాల్ కు మాత్రం స్పోర్ట్స్ లో ఇలాంటివి సహజమని తెలుసు. అందుకే ఆయన స్ట్రాంగానే ఉన్నారు.
"స్పోర్ట్స్ లో ఇలాంటివి సహజమే. జీవితంలోనూ ఇలాంటి వైఫల్యాలు ఎదురైనప్పుడు ఆశ కోల్పోకూడదు" అని చంద్రపాల్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ గుజరాత్ టీమ్మేట్స్ తన కొడుకు యశ్ లో ధైర్యం నింపడానికి ప్రయత్నించడాన్ని చంద్రపాల్ కొనియాడారు. "వాళ్లంతా అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని ఓదార్చారు. ఆ తర్వాత అతనితో కలిసి ఆడిపాడారు" అని చంద్రపాల్ చెప్పారు.
ఆ రోజు రాత్రి తాను యశ్ తో మాట్లాడానని, బంతి జారిపోతుండటంతో సరైన గ్రిప్ దొరకలేదని అతడు వాపోయినట్లు ఆయన వెల్లడించారు. యశ్ బౌలింగ్ గురించి రింకూకు ముందే తెలుసని, అది కూడా అతనికి కలిసొచ్చిందని చెప్పారు. 2021 విజయ్ హజారే ట్రోఫీలో 14 వికెట్లు తీసిన తర్వాత యశ్ దయాల్ ను గుజరాత్ టైటన్స్ టీమ్ కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్