'భూకంపం'పై పార్లమెంట్లో చర్చ జరుగుతుండగానే కంపించిన భూమి!
యూరోప్లోని ఓ చిన్న దేశమైన లిచెన్స్టెయిన్లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భుకంపాల బీమాపై ఆ దేశ పార్లమెంట్ చర్చ చేపట్టింది. కానీ భూ ప్రకంపనల కారణంగా ఆ చర్చ నిలిచిపోయింది!
Liechtenstein parliament debate on earthquake insurance : ఆ దేశ పార్లమెంట్లో.. భూకంపాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. భూకంపాల బీమాపై పార్లమెంట్ సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఇంతలో భూమి కంపించింది! భూకంపాలపై చర్చ జరుగుతున్నప్పుడే.. భూమికంపించడంతో లిచెన్స్టెయిన్ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఏం జరిగిందంటే..
యూరోప్లోని ఆస్ట్రియా - స్విట్జ్ర్లాండ్ దేశాల మధ్యలో ఉంటుంది ఈ లిచెన్స్టెయిన్. ఆల్ప్స్ పర్వతాల్లో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఫలితంగా లిచెన్స్టెయిన్లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. దేశంలో భూకంపాల పరిస్థితి, బీమా వంటి అంశాలపై లిచెన్స్టెయిన్ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఓ నేత ప్రసంగించడం మొదలుపెట్టారు. అప్పుడే తొలిసారి భూమికంపించింది. ఓ నవ్వు నవ్వేసి.. ఆమె ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెట్టారు. అప్పుడో రెండోసారి భూకంపం వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పార్లమెంట్ కెమెరాలకు చిక్కాయి.
Liechtenstein earthquake : ఈసారి.. భూకంపం తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. కెమెరాలు షేక్ అయ్యాయి. ఆ నేత వెనకాల ఉన్న ఓ భవనంపై భూకంపం ప్రభావం పడింది.
చివరికి.. భూకంపాల బీమాపై చర్చ అర్ధాంతరంగా నిలిచిపోయింది. పార్లమెంట్ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 'భూకంపం బీమాపై చర్చ జరుగుతుండగామే భూమి కంపించింది. చర్చ నిలిచిపోయింది,' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:
సంబంధిత కథనం