Iran Earthquake : ఇరాన్లో భూకంపం.. ఏడుగురు మృతి!
Iran Earthquake today : ఇరాన్లో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 400కుపైగా మంది ప్రజలు గాయపడ్డారు.
Iran Earthquake today : ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది! టర్కీకి సరిహద్దులోని వాయువ్య ఇరాన్ ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 400కుపైగా మంది ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. రిక్టార్ స్కేలుపై ఇరాన్ భూకంపం తీవ్రత 5.9గా నమోదైంది. ఖోయ్ నగరం కేంద్రబిందువుగా ఈ భూకంపం సంభవించింది.
Earthquake in Iran : భూప్రకంపనలు నమోదైన కొన్ని ప్రాంతాల్లో.. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు మంచు కూడా తీవ్రంగా కురుస్తోంది. ఫలితంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇరాన్లో భూకంపాల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా.. భూకంపాలు ఇక్కడి ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే.. జనవరి 18న సంభవించిన భూకంపం ధాటికి ఖోయ్ ప్రాంతంలో వందలాదిమంది గాయపడ్డారు.
2020 ఫిబ్రవరిలో 5.7 తీవ్రతతో నమోదైన భూకంపం.. ఇరాన్ను వణికించింది. హబాష్ ఈ ఓల్యా ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 9మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.
ఇక 1990లో 7.4 తీవ్రతతో ఇరాన్లో సంభవించిన భూకంపాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నార. ఆ ఘటనలో 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3లక్షలమంది గాయపడ్డారు. 5లక్షలకుపైగా మంది నిరాశ్రయులయ్యారు.
'భూకంపాల' ప్రపంచం..!
ప్రపంచంలో భూకంపాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. నేపాల్, ఇండోనేషియా ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతూ అక్కడి ప్రజలు జీవిస్తున్నారు.
నేపాల్లో ఈ నెల 24న భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 5.8గా నమోదైంది. భారత్లోని ఉత్తరాఖండ్లో పితోరగఢ్కు తూర్పుగా 148 కిమీల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఫలితంగా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాలతో పాటు ఢిల్లీలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూమిలో 10 కిమీల లోతున సంభవించిన ఈ భూకంపం కారణంగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్లలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం