తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం-parliament passes bill to set up central tribal university in telangana ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

HT Telugu Desk HT Telugu

తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

**EDS: VIDEO GRAB VIA SANSAD TV** New Delhi: Rajya Sabha Chairman Jagdeep Dhankhar conducts proceedings in the House during the Winter session of Parliament, in New Delhi, Wednesday, Dec. 13, 2023. (PTI Photo)(PTI12_13_2023_000094B) (PTI)

న్యూఢిల్లీ, డిసెంబరు 13: తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 

లోక్ సభలో భద్రతా ఉల్లంఘనపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వాకౌట్ చేయగా వారి గైర్హాజరీలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు-2023ను ఎగువ సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. 

జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న డబ్బాల నుంచి పసుపు రంగులో ఉన్న వాయువును విడుదల చేసి నినాదాలు చేశారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణలో 'తానాషాహీ నహీ చలేగీ' అంటూ నినాదాలు చేస్తూ ఓ మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు డబ్బాల నుంచి రంగు గ్యాస్‌ను పిచికారీ చేశారు.

కాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023కు లోక్సభ గత వారం ఆమోదం తెలిపింది. దీనిపై చర్చకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తప్పనిసరి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి క్యాంపస్‌ను ప్రారంభించామని, తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో సహకరించి ఉంటే ఈపాటికి ఈ విశ్వవిద్యాలయం వచ్చి ఉండేదన్నారు. భూమి ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని, అందువల్ల అమలులో జాప్యం జరిగిందన్నారు.

బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి జాతీయ సంస్థగా పనిచేసేలా అన్ని ప్రక్రియలను త్వరితగతిన చేపడతామని మంత్రి సభకు హామీ ఇచ్చారు. 

జాతీయ విద్యావిధానం 2020 ద్వారా చరిత్రను తిరగరాయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలను ప్రధాన్ తోసిపుచ్చారు.

డ్రాపవుట్లపై సమాధానం

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్యార్థుల డ్రాపవుట్ రేట్లపై కొందరు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, వారికి మెరుగైన ఆప్షన్లు లభించడం, ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం ఒక కారణమని, ఇది గత సంస్థ నుంచి డ్రాపవుట్ గా ప్రతిఫలిస్తోందని చెప్పారు.

ప్రభుత్వ విశ్లేషణను ఉటంకిస్తూ, గత ఐదేళ్లలో ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో మొత్తం 2,66,433 (2.66 లక్షలు) మంది చేరారని, వీరిలో 4,081 మంది (1.53 శాతం) విద్యార్థులు చదువు మానేశారని తెలిపారు.

ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల డ్రాపవుట్ రేటు వరుసగా 1.5 శాతం, 1.47 శాతం, 1.29 శాతంగా ఉందని ప్రధాన్ తెలిపారు.

ఉన్నత చదువుల కోసం చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిందని కొందరు ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న వాదనలను మంత్రి తోసిపుచ్చారు, దీనికి విరుద్ధంగా 2014-15తో పోలిస్తే 2021-22లో ఇది 26 శాతం పెరిగిందని అన్నారు.

మంత్రి సమాధానానికి ముందు సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఓబీసీలు, గిరిజన సంక్షేమానికి సంబంధించిన బిల్లు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడానికి సాకులు చెబుతున్నాయని అన్నారు. ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో ఒక ముఖ్యమైన గిరిజన విశ్వవిద్యాలయం రాబోతోంది. ఈ సందర్భంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ లోక్ సభ భద్రతా ఉల్లంఘన అంశాన్ని రాజకీయం చేయడానికి వారు వాకౌట్ చేశారని గోయల్ అన్నారు.

చర్చలో పాల్గొన్న గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ తెలంగాణలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా భారతదేశ పురోగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిబింబమని అన్నారు.

ప్రశాంత్ నంద (బీజేడీ), సదానంద్ షెట్ తానావ్డే (బీజేపీ), ఎం.తంబిదురై (అన్నాడీఎంకే), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), వి.విజయసాయిరెడ్డి (వైసీపీ), అబ్దుల్ వహాబ్ (ఐయూఎంఎల్), బి.లింగయ్య యాదవ్ (బీఆర్ఎస్) చర్చలో పాల్గొన్నారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023 ద్వారా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ప్రతిపాదిత సంస్థ తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను సులభతరం చేస్తుంది. 

భారతదేశంలోని గిరిజన ప్రజలకు గిరిజన కళలు, సంస్కృతి మరియు ఆచారాలు సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతిలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందించడం ద్వారా అధునాతన జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది.

గిరిజన విద్యపై దృష్టి సారించడంతో పాటు, ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం అన్ని విద్యా, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009, వివిధ రాష్ట్రాల్లో బోధన మరియు పరిశోధన కోసం విశ్వవిద్యాలయాలను స్థాపించి, విలీనం చేయడానికి రూపొందింది. ఈ చట్టాన్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.