New govt in Srilanka | శ్రీలంకలో వారంలో `అఖిలపక్ష` ప్రభుత్వం
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. నిరసనకారులు శనివారం ఏకంగా అధ్యక్ష భవనాన్నే ముట్టడించారు. ఆ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సమావేశమైన ప్రభుత్వ పెద్దలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శ్రీలంకలో శనివారం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు రాజపక్సే, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచే ఆందోళనకారులు కొలంబో వీధుల్లో పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అందోళనకారులు వేలాదిగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. భద్రత సిబ్బంది అధ్యక్షుడు రాజపక్సెను సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే వివరాలు గోప్యంగా ఉంచారు. శ్రీలంకకు చెందిన అనేకమంది ప్రముఖులు ఆందోళనలకు మద్దతు తెలిపారు. రాజపక్సెను ఉద్దేశించి `మీ రాజ్యం కూలిపోయింది` అంటూ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ట్వీట్ చేశారు.
New govt in Srilanka | ప్రత్యేక సమావేశం
ఈ నేపథ్యంలో ప్రధాని రణిల విక్రమ సింఘె పార్లమెంట్లో స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని ప్రధాన పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని విక్రమసింఘె, అధ్యక్షుడు రాజపక్సె రాజీనామా చేయాలని అధికార పార్టీ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. వారి డిమాండ్కు ప్రధాని విక్రమ సింఘె తలొగ్గారు. `పార్టీ నాయకుల సూచన మేరకు ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను` అని విక్రమసింఘే ట్విటర్లో వెల్లడించారు. తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు రాజపక్సే ప్రధాని విక్రమసింఘేకు సమాచారమిచ్చినట్లు సమాచారం.
New govt in Srilanka | కీలక నిర్ణయాలు
పార్లమెంట్లో జరిగిన కీలక సమావేశంలో నాలుగు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు పార్లమెంటు సభ్యుడు అలహపెరుమ వెల్లడించాడు.
ఆ నిర్ణయాలు..
1) తక్షణమే అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్సె, ప్రధాని పదవికి రణిల విక్రమ సింఘె రాజీనామా చేయాలి.
2) తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ యాప అభయవర్ధన బాధ్యతలు చేపట్టాలి.
3) వారం రోజుల లోపు పార్లమెంటు సమావేశమై, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి.
4) వారం రోజుల లోపు అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడాలి.