Tripura CM: త్రిపుర సీఎంగా మళ్లీ ఆయనే: ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ!
Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మరోసారి ఎంపికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేను ఆయనను ఎన్నుకున్నారు.
Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా (Manik Saha) కొనసాగనున్నారు. గత నెల జరిగిన ఎన్నికల్లో బీజేపీ (BJP) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మాణిక్ సాహాను శాసనసభా పక్ష నేత (Legislative party Leader)గా సోమవారం (మార్చి 6) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 సీట్లను దక్కించుకొని.. అధికారాన్ని నిలబెట్టుకుంది. కషాయ పార్టీ మిత్ర పక్షం ఐపీఎఫ్టీ ఒక్క సీటు సాధించింది. ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా కొనసాగనున్నారు.
ప్రమాణ కార్యక్రమానికి పీఎం
Tripura CM Manik Saha: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం (మార్చి 8) జరుగుతుందని తెలుస్తోంది. అదే రోజు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని సమాచారం.
Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా గతేడాది బాధ్యతలు చేపట్టారు. బిప్లవ్ కుమార్ దేవ్ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం మాణిక్కు సీఎం పదవి అప్పగించింది. ఏక్ త్రిపుర, శ్రేష్ఠ్ త్రిపుర నినాదాన్ని మాణిక్ విస్తృతంగా ప్రచారం చేశారు.
Tripura CM Manik Saha : టౌన్ బర్దోవాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాణిక్ సాహా గెలిచారు. ఊహించిన విజయాన్ని సాధించామని ఫలితాల తర్వాత ఆయన అన్నారు. “బీజేపీ విజయం ఊహించినదే. కాకపోతే మేం ఆసక్తిగా ఎదురు చూశాం అంతే. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన దారిలో మేం ముందుకు సాగుతాం” అని మాణిక్ సాహా అన్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
Tripura Assembly Election Results: ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ నెల 2న ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీకి 32 సీట్లు వచ్చాయి. బీజేపీ మిత్రపక్షం ఐపీఎఫ్టీకి ఓ స్థానం దక్కింది. సీపీఎం 11 చోట్ల గెలిచింది. తిప్రా మోతా పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కు 3 సీట్లు దక్కాయి. దశాబ్దాల పాటు వామపక్షాలు.. త్రిపురను పాలించాయి. 2018లో కమ్యూనిస్టు కంచుకోట త్రిపురను బద్దలుకొట్టి.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లో 36 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది కషాయ పార్టీ.
సంబంధిత కథనం