Menthulu Pulusu Recipe । మెంతులు పులుసు.. రుచిలో అమోఘం, తింటే ఎంతో ఆరోగ్యం!
Menthulu Pulusu Recipe: మెంతులు నానబెట్టుకొని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మీరు మెంతులను పులుసు పెట్టుకొని కూడా అన్నంలో కలుపుకొని తినవచ్చు. మెంతులు పులుసు రెసిపీ ఇక్కడ చూడండి.
Healthy Summer Foods: వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒంటికి చలువ చేసే ఆహారం తీసుకోవడం మంచిది. మెంతి శరీర ఉష్ణోగ్రతను తగ్గించగలదని చెప్తారు. చాలా మంది మెంతికూరను, మెంతులను వివిధ రూపాలలో తీసుకుంటారు. ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని త్రాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరలను తగ్గిస్తుంది, కాబట్టి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు, తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి, అధిక బరువు తగ్గడానికి, మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచటానికి, స్పెర్మ్ కౌంట్ను పెంచడానికి మెంతులను తీసుకుంటారు. ఇంకా శరీరంలో నొప్పి, వాపులను తగ్గించటానికి, గుండెజబ్బులు, రక్తపోటు పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించటానికి మెంతులను ఆహారంలో చేర్చుకుంటారు.
మెంతులతో చేసే మెంతిపులుసు రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మెంతిపులుసు ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదివి సులభంగా చేసుకోండి.
Menthulu Pulusu Recipe కోసం కావలసినవి
- మెంతులు - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు - 2 కప్పులు
- పచ్చిమిర్చి - 4
- చింతపండు పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కారం పొడి - 2 tsp
- నీరు - 1 కప్పు
- వెల్లుల్లి - 4 రెబ్బలు
- ధనియాలు - 1 tsp
- జీలకర్ర - 1/3 tsp
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఎండు మిర్చి - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- రుచికి తగినంత ఉప్పు
మెంతులు పులుసు తయారీ విధానం
- ముందుగా మెంతులను కడిగి కనీసం 4 గంటల పాటు తగినన్ని నీటిలో నానబెట్టాలి, అనంతరం నీటిని తీసేసి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రను మెత్తగా పేస్ట్గా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి తురుము వేసుకొని వేయించాలి.
- అనంతరం నానబెట్టిన మెంతులు వేసి 3 నుండి 4 నిమిషాలు వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, బాగా కలుపుతూ వేయించాలి.
- ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.
- ఆపైన కారంపొడి, చింతపండు పేస్ట్ వేసి బాగా కలుపండి, పులుపు తగ్గటానికి కొద్దిగా బెల్లం కూడా కలుపుకోవచ్చు.
- అనంతరం ఒక కప్పు నీరు వేసి కలపండి, రసం మరుగుతుండగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ జో వేసి బాగా కలుపండి.
- ఇలా 8-10 నిమిషాలు మీడియం మంట మీద మూతపెట్టి ఉడికించాలి.
అంతే, రుచికరమైన మెంతులు పులుసు రెడీ. అన్నంలో కలుపుకొని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది.
సంబంధిత కథనం