Tata Motors price hike : పండుగ సీజన్పై భారతీయులు భారీ ఆశలే పెట్టుకుంటారు. ఈ సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఇస్తే, వాటితో లబ్ధిపొంది, సొంత వాహనాలు కొనుక్కోవాలని చూస్తుంటారు. అలాంటిది.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.
కమర్షియల్ వాహనాల ధరలను 3శాతం వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటన చేసింది టాటా మోటార్స్. తాజా పెంపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. వాహనాలపై ప్రైజ్ హైక్ తీసుకోవడం.. ఈ ఏడాదిలో సంస్థకు ఇది మూడోసారి. ధరల పెంపుపై ఈసారి కూడా ఎప్పుడూ చెప్పే మాటలే చెప్పింది. ముడిసరకు ధరలు పెరగడంతో.. వాహనాల రేట్లు పెంచక తప్పట్లేదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది జనవరిలో 1.2శాతం, మార్చ్లో 5శాతం వరకు వాహనాల రేట్లను పెంచింది టాటా మోటార్స్. ఇక ఇప్పుడు 3శాతం ప్రైజ్ హైక్ తీసుకుంది. అయితే ఇది కేవలం కమర్షియల్ వాహనాలపై మాత్రమే అని తెలుస్తోంది. ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి ఈసారి సంస్థ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. మరి పీవీ సెగ్మెంట్లో రేట్ హైక్ ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.
Tata Motors latest news : టాటా మోటార్స్తో పాటు అనేక ఆటోమొబైల్ సంస్థలు గత కొన్నేళ్లుగా తమ వాహనాల ధరలను పెంచుతూ వెళ్లిపోతున్నాయి. అయినప్పటికీ, కస్టమర్ల నుంచి విపరీతంగా డిమాండ్ వస్తుండటంతో ధరల పెంపునకు సంస్థలు ఇంకా ధైర్యం చేయగలుగుతున్నాయి. అయితే.. ఈసారి ఇండియాలో కమర్షియల్ వాహనాల సేల్స్ తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వెల్లడించింది. సింగిల్ డిజిట్ గ్రోత్ నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కస్టమర్లపై విపరీతంగా భారం పడుతుండటమే ఇందుకు కారణం అని పేర్కొంది.
సంబంధిత కథనం