PSLV | పీఎస్ఎల్వీ-సీ 52 కౌంట్ డౌన్ ప్రారంభం
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం.. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 52 వాహక నౌక ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మేరకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
పీఎస్ఎల్వీ-సీ 52 వాహన నౌక ప్రయోగాన్ని షార్.. రేపు చేపట్టనుంది. ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 25.30 గంటలపాటు కొనసాగుతుంది. ఆ త్వరాత పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహకనౌక.. పీఎస్ఎల్వీ సి 52తో 1710 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–4తో పాటు భారత దేశంలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన రెండు చిన్న ఉపగ్రహాలు ఇన్స్పైర్ శాట్–1, ఐఎన్ఎస్–2టీడీని సైతం పంపుతున్నారు.
మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సి 52 ప్రయోగం జరగనుంది. ప్రయోగంపై షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో శనివారం ఎంఆర్ఆర్ సమావేశం జరిగింది. రాకెట్ కు సంబధించి.. అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ రాజరాజన్కు అప్పగించారు.
25.30 గంటల కౌంట్డౌన్ పూర్తయ్యాక.. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈఓఎస్–4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి సమాచారాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇంకా ప్రయోగాలు పెంచుతామని.. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్–3, గగన్యాన్–1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పీఎస్ఎల్వీ– సి 52 ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందని చెప్పారు. ఇస్రో ఛైర్మన్గా తనకు ఇది తొలి ప్రయోగమని సోమనాథ్ పేర్కొన్నారు. విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కౌంట్ డౌన్ ప్రక్రియలో నిమగ్నమై.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.