TS Inter Exams : ఇంటర్ విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి సబిత.. ఒత్తిడి వద్దని సూచన -minister sabita indra reddy advices inter students to write exams without stress and fear ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Sabita Indra Reddy Advices Inter Students To Write Exams Without Stress And Fear

TS Inter Exams : ఇంటర్ విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి సబిత.. ఒత్తిడి వద్దని సూచన

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 06:17 PM IST

TS Inter Exams : ఇంటర్ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు లోనుకాకండా పరీక్షలు రాసి విజయం సాధించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె... పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

ఇంటర్ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
ఇంటర్ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

TS Inter Exams : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 15 నుంచి మొదలయ్యే పరీక్షల కోసం సర్వం సిద్ధం చేశారు. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఈ పరీక్షలకు.. ఫస్టియర్, సెకండియర్ కలిపి 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యేలా అధికారులు చూడాలని... ఇందుకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని మంత్రి సబిత పిలుపునిచ్చారు. ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందని అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వారిలో మనోధైర్యాన్ని నింపాలని కోరారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పరీక్షలు సమర్థవంతమైన రీతిలో, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

పరీక్షల సమయంలో విద్యుత్ కి ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. హాల్​టికెట్లను డౌన్​లోడ్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ల ద్వారా వారికి మోటివేషన్​ ఇప్పించి పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp channel