MLA Rohith Reddy On ED Notices: బండి సంజయ్కి భవిష్యవాణి తెలుసా..?
BRS MLA Rohit Reddy on ED notices: ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. బీజేపీ బండారం బయట పెట్టినందుకే కక్ష పూరితంగా తనకు నోటిసులిచ్చారని ఆరోపించారు. తనకి నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్ కు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు.
ED notice to MLA pilot Rohith Reddy: తెలంగాణలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచేస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే ఎర కేసు సంచలనం సృష్టించగా.. మరోవైపు లిక్కర్ కేసు, క్యాసినో వ్యవహరంపై ఈడీ ముమ్మర విచారణ చేస్తోంది. సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసింది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన విచారణ హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్యేల ఎర కేసును బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. అసలు తనకి ఈడీ నోటీసులు వస్తాయని బండి సంజయ్ కి ముందుగానే ఎలా తెలుసని ప్రశ్నించారు. బండి సంజయ్కి ఏమైనా భవిష్యవాణి తెలుసా ? అని కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో తనకి ఎప్పుడో నోటీసు వచ్చిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఇలాంటి నోటీసులకు తాను భయపడనని స్పష్టం చేసింది. ఈడీ తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బెదిరించినా వెనక్కి తగ్గేది లేదన్నారు. లీగల్ ఓపినియన్ తీసుకుని ఈడీ నోటీసులకు తగిన సమాధానం ఇస్తానని చెప్పారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు రావట్లేదని రోహిత్ రెడ్డి ప్రస్నించారు.
ED Notices to Rohit Reddy : తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డితో సినీ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కు శుక్రవారం ఈడీ నోటీసులు ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. 2021లో బెంగళూరు పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్త కళహర్ రెడ్డితో కలిసి బెంగళూరులో డ్రగ్స్ పార్టీకి రోహిత్ రెడ్డి వెళ్లినట్లు నోటీసుల్లో పేర్కొంది. సినీ నిర్మాత శంకర్ గౌడ్ ఆ పార్టీ ఇచ్చినట్లు తెలిపింది. పార్టీ కోసం రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ నైజీరియన్ల నుంచి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు.
ఇదే కేసులో నటి రకుల్ ప్రీత్సింగ్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోవడంతో.. ఈడీ అధికారులు అమెను అప్పుడు పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. దీంతో మరోసారి విచారణకు హాజరుకావాలని రకుల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుందని రెండు రోజుల క్రితమే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయని వెల్లడించారు. సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసిన మూడో రోజే... రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు పంపడం.. సంచలనంగా మారింది.