BRS In AP : ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఇక్కడే.. ఇంతకీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తెలుసా?
BRS Office In AP : బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనా ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే.. పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు పరిశీలిస్తున్నారు.
బీఆర్ఎస్(BRS) పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా కేసీఆర్(KCR) కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అనుకున్నట్లే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కూడా మార్చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరణపై ఫోకస్ చేశారు. జక్కంపూడి సమీపంలో మూడు స్థలాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో వెళ్లి.. పరిశీలిస్తారు. ఒకదాన్ని ఎంపిక చేస్తారు. అక్కడ నిర్మాణం చేపట్టనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి దిల్లీ(Delhi)లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తోంది. ఇందుకోసం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడ(Vijayawada) సమీపంలో అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని కేసీఆర్(KCR) అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నాలుగైదు రోజుల్లో వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది.
ఇక నిర్మాణం పూర్తయిన వెంటనే.. అక్కడ కార్యాకలాపాలు మెుదలుకానున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో పని చేసేందుకు చాలామంది నేతలు ఉత్సాహంగా ఉన్నారు. జక్కంపూడిలో 800 గజాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఆదినారాయణ చెప్పారు. జక్కంపూడి వద్దే.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటూ ఫ్లేక్సీలు వెలిశాయి.
బీఆర్ఎస్ ప్రకటించిన రోజే.. ఏపీలోనూ కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. టపాసులు కూడా పేల్చి సంబరాలు కూడా చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆదినారాయణ అంటూ.. ఫ్లెక్సీల్లో కనిపిస్తున్నాయి. ఏపీలో పార్టీ వ్యవహారాలు సైతం ఆయనే.. చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి తలసాని పర్యటనకు కూడా ఆదినారాయణ ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్(BRS) మారుస్తూ ఈసీ పంపిన పత్రాలపై కేసీఆర్ ఇటీవలే సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కుమారస్వామి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టుగా వెల్లడించారు. మెుదట ఏఏ రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఏపీపై కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నారా..? అనేది త్వరలోనే తేలనుంది.