MLC Kavitha On BJP : ఐటీ, ఈడీ వచ్చినా నిలబడి కొట్లాడుతాం.. భయపడే ప్రసక్తే లేదు
MLC Kavitha Comments : ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ తమపైకి ఉసిగొల్పినా భయపడే ప్రస్తకే లేదని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. భయపడే తత్వం తెలంగాణ ప్రజల్లో లేదని, నిలబడి కొట్లాడుతామని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదిగిన నాయకులను ఎత్తుకు పోవాలనే ఆలోచన బీజేపీకి ఉందన్నారు.
రాముడి పేరు చెప్పాలి రౌడీయిజం చేయాలి అన్నది బీజేపీ(BJP) పద్ధతి అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మండిపడ్డారు. ఏం చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
'అసలు బీజేపీ వాళ్లకు రాష్ట్రంలో ఏం పని? రామ్ రామ్ జాప్న.. పరాయి లీడర్ ఆప్నా అనేదే బిజెపి(BJP) పని. ఆ పార్టీకి ఒక నాయకుడు లేడు. ఒక సిద్ధాంతం లేదు. వాళ్లు ప్రజలలో లేరు. వాళ్లలో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి నాయకులు లేరు. పోటీ చేసినా వాళ్లు ఎన్నికల్లో గెలువరని భావించి కాంగ్రెసు(Congress), టీఆర్ఎస్(TRS) వంటి పార్టీల్లో పెద్ద లీడర్లపై కేసులు పెట్టి, ఐటీ దాడులు(IT Radis) చేయించి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో చేరకపోతే ఈడీ,ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్నారు. తెలంగాణ ప్రజలు(Telangana People) భయపడే వాళ్ళు కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎవరినీ వదిలిపెట్టకుండా మన దగ్గర గత నెల రోజులుగా ఐటీ దాడులను చేస్తున్నారు.' అని కవిత అన్నారు.
ఎవరు వచ్చినా.. ఏం భయం లేదని కవిత అన్నారు. చట్టబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. అధికారులు వివరాలు అడిగితే ఇస్తాం, పత్రాలు ఇస్తాం చూసుకోండి అంతేగాని దాంట్లో భయపెట్టేదేముంది ? ప్రచారం చేసుకోవడానికి ఏముంది? ఎందుకోసం ఇట్ల చేస్తున్నారు ? అని అడిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను(TRS MLAs) కొలుగోలు చేయడానికి వచ్చిన వాళ్లు బీజేపీ జాతీయ అగ్రనేత బీఎల్ సంతోష్(BL Santhosh) పేరు ప్రస్తావించారని కాబట్టి ఆయనను విచారణకు రమ్మని సిట్ అధికారులు పిలుస్తే రావడం లేదని తెలిపారు. ఎందుకు అంత భయమని ప్రశ్నించారు.
మన దగ్గర దొరికిన దొంగలను విచారణ చేయవద్దట. యాదగిరిగుట్టలో బండి సంజయ్(Bandi Sanjay) దొంగ ప్రమాణాలు చేశారు. నిన్న ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడో నాకు అర్థం కాలేదు. దొరికిన దొంగను అరెస్టు చేయకుండా కోర్టుకు వెళ్తే విచారణకు రావాల్సిందేనని బిఎల్ సంతోష్ కి కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన విచారణకు హాజరుకావడం లేదు. మన మంత్రులు ఐటీ,ఈడీ, సీబిఐ వాళ్లు పిలిస్తే వెళ్తున్నారు. కానీ బిఎల్ సంతోష్ ఎందుకు రావడం లేదు అన్నది ప్రజలు ఆలోచించాలి.
- ఎమ్మెల్సీ కవిత
వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ(BJP) తప్పుడు ప్రచారం చేస్తోందని కవిత అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. కానీ ఆ 2000 మొత్తం మోదీ ఇస్తున్నట్లు వాట్సాప్ లో బీజేపీ ప్రచారం చేస్తుందని, అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని(Rythu Bandhu Scheme) కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) అనే పథకం పెట్టారన్నారు. పథకం పెట్టిన నాడు 13 కోట్ల మంది రైతులకు ఇస్తున్నామని చెప్పిన కేంద్రం ఇప్పుడు మూడు కోట్లకు తగ్గించారని, పథకం నుంచి 10 కోట్ల మంది రైతులను తప్పించారని చెప్పారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాదయాత్రలో భాగంగా తెలంగాణకు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని, తెలంగాణకు ఏం చేస్తారో కూడా చెప్పలేదని అన్నారు. దక్షిణ తెలంగాణలో మునుగోడు లో ఉప ఎన్నిక జరుగుతుంటే ఆయన ఉత్తర తెలంగాణ మీదుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడని విమర్శించారు.
తెలంగాణ(Telangana) యువకులకే 95 శాతం ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించాలని కేంద్రానికి ప్రతిపాదించామని, ఆ తర్వాత రాజకీయ చరిత్ర వల్ల అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని కవిత తెలిపారు. 96 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. చంద్రబాబు బలమైన నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ బయటకువచ్చి తెలంగాణ కోసం నడుంబిగించారని, రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడుతాయని కేసీఆర్ విశ్వసించారని గుర్తు చేశారు.