Robin Uthappa on Team India: ఆ కారణం వల్లే టీమిండియా ఐసీసీ టోర్నీలు గెలవలేకపోతోంది: ఉతప్ప-robin uthappa on team india says sense of insecurity is the reason behind not performing in icc tournaments ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Robin Uthappa On Team India Says Sense Of Insecurity Is The Reason Behind Not Performing In Icc Tournaments

Robin Uthappa on Team India: ఆ కారణం వల్లే టీమిండియా ఐసీసీ టోర్నీలు గెలవలేకపోతోంది: ఉతప్ప

Hari Prasad S HT Telugu
Jan 16, 2023 03:02 PM IST

Robin Uthappa on Team India: టీమిండియా ఐసీసీ టోర్నీలు గెలవలేకపోవడం వెనుక ఉన్న కారణమేంటో చెప్పాడు మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐఎల్‌టీ20లో ఆడుతున్న అతడు.. ప్లేయర్స్‌లో నెలకొన్న అభద్రతా భావం వల్లే ఇలా జరుగుతోందని అన్నాడు.

టీమిండియా ఆటగాళ్లలో ఉన్న అభద్రతా భావం వల్లే ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్నారన్న ఉతప్ప
టీమిండియా ఆటగాళ్లలో ఉన్న అభద్రతా భావం వల్లే ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్నారన్న ఉతప్ప (PTI)

Robin Uthappa on Team India: ఇండియన్‌ టీమ్‌ ఎంపిక విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప. అసలు టీమిండియా ఐసీసీ టోర్నీల్లో విఫలం కావడానికి టీమ్‌ ఎంపిక, ప్లేయర్స్‌లో నెలకొన్న అభద్రతా భావమే కారణమని చెప్పాడు. 2011 నుంచి ఇండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

తుది జట్టులో చాలా తక్కువ మార్పులు చేసిన టీమ్సే ట్రోఫీలు గెలుస్తాయంటూ.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఉదాహరణలు అతడు చెప్పాడు. "కుల్దీప్‌ బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌. అతన్ని తర్వాతి మ్యాచ్‌కు తప్పించారు. ఇది ప్లేయర్స్‌కు తప్పుడు సందేశాన్ని పంపిస్తుంది. కుల్దీప్‌కు వివరణ ఇచ్చి ఉంటారు కానీ ఇది మిగతా ప్లేయర్స్‌కు తప్పుడు సందేశాన్ని పంపుతుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన తర్వాత కూడా టీమ్‌లో చోటుకు గ్యారెంటీ ఉండదన్న భావన కలుగుతుంది" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప చెప్పాడు.

"టీమ్‌లోని ప్లేయర్స్‌లో అభద్రతా భావం కనిపిస్తోంది. చాలా రోజులుగా టీమ్‌లో నిలకడగా మార్పులు జరుగుతున్నాయి. ఓ ప్లేయర్‌ అభద్రతా భావంతో ఉన్నప్పుడు అతడు భయంభయంగా ఉంటాడు. టీమ్‌లో స్థానాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. అందుకే ప్లేయర్స్‌కు టీమ్‌లో చోటు ఖాయమన్న ఆలోచన కల్పించాలి. కానీ కొన్నాళ్లుగా చాలా మార్పులు జరుగుతున్నాయి. తర్వాతి మ్యాచ్‌లో ప్లేస్‌ ఉంటుందో లేదో అన్న ఆలోచన కారణంగా కీలకమైన మ్యాచ్‌లలో వాళ్లు రాణించలేకపోతున్నారు" అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.

"ఐపీఎల్‌ను చూడండి. తుది జట్టులో చాలా తక్కువ మార్పులు చేసిన టీమ్స్‌ ఎక్కువ టైటిల్స్‌ గెలిచాయి. చెన్నై, ముంబై సక్సెస్‌ అదే చెబుతోంది" అని ఉతప్ప అన్నాడు. ఇక విదేశీ లీగ్‌లలో ఆడేందుకు ఇండియన్‌ క్రికెట్‌ను వీడినందుకు తానేమీ బాధపడటం లేదని కూడా చెప్పాడు. విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు ఇండియన్‌ ప్లేయర్స్‌కు బీసీసీఐ అనుమతి ఇవ్వదు. దీంతో వాటిలో ఆడాలనుకున్న ప్లేయర్స్‌ ముందు రిటైరై, తర్వాత ఆయా లీగ్స్‌కు వెళ్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్